తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ నిర్వహిస్తున్న కార్గో సేవల ద్వారా బుక్ చేసుకున్న పార్సిళ్లను నేరుగా హోమ్ డెలివరీ చేయాలని నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన సేవలను దీపావళి పండగ సందర్భంగా అంటే.. అక్టోబర్ 31వ తేదీ నుంచి ప్రారంభించింది. ఈ సేవలు రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయని తెలిపింది.
అలాగే ఈ సేవల ద్వారా బుక్ చేసుకునే పార్సిళ్లకు కేజీల బట్టి రుసుం వసూల్ చేస్తామని వివరించింది. కేజీ నుంచి ఐదు కేజీల వరకు రూ. 50. అలాగే కేజీ బరువు దాటిన నాటి నుంచి ఐదు కేజీల వరకు రూ. 60. ఐదు కేజీల నుంచి 10 కేజీల వరకు రూ. 65. పది కేజీలపై నుంచి 20 కేజీల వరకు రూ. 70. 20 కేజీలపై నుంచి 30 కేజీల వరకు రూ. 75 వసుల్ చేస్తామని టీజీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది. దీనిపై మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకునే వారు.. 9030134242, 3030135242 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చని సూచించింది.
మరోవైపు తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పేరిట మహాలక్ష్మీ పథకం అమలు చేస్తుంది. ఈ పథకం వల్ల సంస్థకు నష్టం వస్తుందనే ఓ ప్రచారం అయితే సాగుతుంది. అలాంటి వేళ.. సంస్థ వివిధ మార్గాల్లో ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అందులోభాగంగా పార్సిళ్లను హోమ్ డెలివరీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందనే ఓ చర్చ సైతం సంస్థ ఉద్యోగుల్లో కొనసాగుతుంది.
ఇంకోవైపు హైదరాబాద్ మహానగరంలో రాత్రి 9.00 గంటల తర్వాత పలు ప్రాంతాలకు అటు సికింద్రాబాద్ నుంచి ఇటు అఫ్జల్గంజ్ నుంచి సీటి బస్సులు అందుబాటులో ఉండడం లేదు. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి రాత్రి సమయంలో నగరానికి చేరుకునే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి సమస్యలు ఎదుర్కొనే వారు.. 040 69440000, టోల్ ఫ్రీ నెంబర్ 8008432929, 040-30102829 నెంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని ఆర్ఠీసీ అధికారులు సూచిస్తున్నారు. ఇలా ఫిర్యాదు చేయడం వల్ల ఆ యా మార్గాల్లో రాత్రి వేళ్లలో బస్సుల సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామని వివరిస్తున్నారు.