బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని మాజీ మంత్రి నిర్ణయించారు. పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని ఆయన చెబుతున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రజలతో కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు శాపంగా మారిందని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ పాలన ఫ్రమ్ ఢిల్లీ, టూ ఢిల్లీ, ఫర్ ఢిల్లీ అన్నట్లుగా తయారైందని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పాలనలో జరిగిన పతనం నుంచి తెలంగాణ కోలుకోవడం అసాధ్యమని చెప్పుకొచ్చారు. ప్రజల పక్షాన కోట్లాడడమే ప్రస్తుత తన ముందున్న బాధ్యత అని తెలిపారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావాడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు అంతా కోరుతున్నందున కచ్చితంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృత స్థాయి పాదయాత్రను నిర్వహిస్తానని ప్రకటించారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (Former CM KCR) సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని.. పార్టీకీ మార్గదర్శనం చేస్తున్నారని తెలిపారు. పార్టీ నేతలపై వేధింపులు, అక్రమ కేసులు పెడుతున్న పోలీసులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్లు అద్భుతంగా పనిచేస్తున్నారని కొనియాడారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రజలతో సంభాషించారు కేటీఆర్.