కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణలో తాము బలహీనవర్గాలకు ప్రాధాన్యం కల్పించామన్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించటమే పనిగా పెట్టుకున్నాయని దుయ్యబట్టారు. బీసీ కులగణన హామీకి కట్టుబడి ఉన్నామని చెప్పారు. నేడు గాంధీభవన్లో కుల గణనపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహిస్తున్న సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి.. బీసీ కుల గణన తెలంగాణలో చరిత్ర సృష్టించబోతోందని చెప్పారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావుకు రైతు రుణమాఫీ గురించి మాట్లాడే కనీస అర్హత లేదని మండిపడ్డారు. ఏడాది తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉండదని కోమటిరెడ్డి జోష్యం చెప్పారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ పని తీరే ఇందుకు కారణమన్నారు. కేసీఆర్ పేరు ఇప్పుడు తెలంగాణలో ఎక్కడా వినపడడం లేదన్నారు. గతంలో తమ పార్టీ ఎమ్మెల్యేలను లాక్కున్న సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న భట్టి విక్రమార్క ఐదుగురు ఎమ్మెల్యేలతో పోరాటం చేశారని గుర్తు చేసారు. అసలు కేసీఆర్ ఫామ్ హౌజ్లో ఉన్నాడా? లేడా? అన్న అనుమానాన్ని కోమటిరెడ్డి వ్యక్తం చేశారు. కేసీఆర్ కి అసెంబ్లీకి వచ్చే ముఖం లేదని అన్నారు.