హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. గతరాత్రి పాత బస్తీ (Old City)లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. టపాసులు నిల్వ ఉంచిన ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు మృతి (Two died) చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ఉషారాణి, మోహన్ లాల్ దంపతులు గత కొంత కాలంగా బాణాసంచా దుకాణం నిర్వహిస్తున్నారు. దీపావళి సందర్బంగా ముందుగానే టాపాసులు తీసుకువచ్చి ఇంట్లో నిలువ ఉంచుకున్నారు. రాత్రి ఇంట్లో వంట చేస్తుండగా నిప్పురవ్వలు ఎగిరి టపాసుల్లో పడడంతో మంటలు అంటుకున్నట్లు సమాచారం. ఒక్కసారిగా మంటలు పెరిగి ఇంట్లో ఉన్న బాణా సంచా మొత్తం పేలిపోయింది. ఈ పేలుడు దాటికి ఉషారాణి, మోహన్ లాల్ దంపతులు వారి కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ దంపతులు మరణించారు. వారి కుమార్తె చికిత్స పొందుతోంది. బాణా సంచా ఇంట్లో నిలువ ఉంచవద్దని పోలీసులు చెబుతూనే ఉన్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.









