జన్వాడ ఫామ్హౌస్ పార్టీ కేసులో సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై కేటీఆర్ స్పందించారు. దావత్ చేసుకుంటే తప్పా అని ప్రశ్నించారు. నందినగర్లోని తన నివాసంలో కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డిపై కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్రెడ్డి కావాలనే తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం వరుస వైఫల్యాలు చెందిందని విమర్శించారు. ఇచ్చిన 6 గ్యారెంటీలను రేవంత్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. 11 నెలల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని అన్నారు. 11 నెలల కాంగ్రెస్ వైఫల్యాలను బయటపెడుతున్నామని చెప్పారు. రాజకీయంగా తమను ఎదుర్కొలేకపోతున్నారని అన్నారు. తమ ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
‘‘కుట్రలతో మా గొంతు నొక్కుతున్నారు. మా కుటుంబ సభ్యులపై కేసులు బనాయిస్తున్నారు. కుట్రలతో మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు..చిల్లర పనులు, కేసులకు భయపడం. అది ఫామ్హౌస్ మా బావమరిది రాజ్ పాకాల ఇల్లు. పార్టీలో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అది ఫ్యామిలీ ఫంక్షన్ మాత్రమే. గృహ ప్రవేశం సందర్భంగా జరిగిన ఫంక్షన్. పార్టీలో ఎలాంటి డ్రగ్స్ దొరకలేదు. దావత్లో 13 మందికి నెగిటివ్ వస్తే ఒకరికే పాజిటివ్ వచ్చిందంట. ఆ వ్యక్తి ఎక్కడ డ్రగ్ తీసుకున్నారో విచారించాలి. సోదాల పేరుతో ఇబ్బందులు పెడితే ఊరుకోం. ఉదయం ఎక్సైజ్ కేసు.. సాయంత్రానికి డ్రగ్స్ కేసుగా ఎలా మారింది. డ్రగ్స్ ఎవరు, ఎక్కడ తీసుకున్నారో తెలుసుకోవాలి. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు కూడబలుక్కుని మాట్లాడుతున్నాయి. నా బావమరిదికి డ్రగ్ టెస్టులో నెగిటివ్ వచ్చింది. నేను వెనక్కి తగ్గేది లేదు.. కాంగ్రెస్ను నిలదీస్తూనే ఉంటాం. చేతనైతే రాజకీయంగా తలపడండి. ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టండి’’ అని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.









