తెలంగాణ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ను ప్రయోగించింది. ఈ మేరకు పోలీస్ ఉద్యోగంలో ఉండి ధర్నాలు, ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్న వారికి షాక్ ఇచ్చింది. సర్వీసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన 39 మంది టీజీఎస్పీ పోలీస్ కానిస్టేబుల్స్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆందోళన వెనక ప్రభుత్వ వ్యతిరేక శక్తుల హస్తం ఉందని అనుమానిస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్..
ఒకే పోలీస్ విధానం అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా బెటాలియన్ కానిస్టేబుళ్లు ఆందోళనకు దిగడం హాట్ టాపిక్ గా మారుతోంది. మొదట కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు మాత్రమే ఆందోళనకు దిగగా.. ఇప్పుడు పోలీసులే ఆందోళనలకు చేయడం చర్చనీయాంశం అవుతోంది. వరంగల్ మామునూరులో 4వ బెటాలియన్ కానిస్టేబుళ్లు కమాండెంట్ ఆఫీసు వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించారు. బెటాలియన్ ఎదుట హైవేపై ధర్నాకు ప్రయత్నించగా.. సివిల్ పోలీసులు వారిని అడ్డుకున్నారు.
కానిస్టేబుల్ కుటుంబం..
మంచిర్యాలలో పోలీస్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు ఆందోళన బాట పట్టారు. చిన్న పిల్లలతో వచ్చి ఐబీ చౌరస్తాలో బైఠాయించి నిరసన చేశారు. ఒకే పోలీసు విధానం అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పోలీసు ఉన్నతాధికారులు హామీ ఇవ్వగా.. కానిస్టేబుల్ భార్యలు ఆందోళన విరమించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో..
అలానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బెటాలియన్ పోలీసుల భార్యలు భారీ ర్యాలీ నిర్వహించారు. చిన్న పిల్లలను ఎత్తుకొని భారీ ర్యాలీగా పాల కేంద్రం నుంచి రైల్వే స్టేషన్ వరకు నిరసన చేపట్టారు. తమ భర్తలతో ఉద్యోగం కాకుండా కూలి పని.. వంట పనులు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సివిల్ పోలీసులతో 8 గంటల ఉద్యోగం ఎలా చేయిస్తున్నారో.. బెటాలియన్ పోలీసులను కూడా అదే తరహాలో ఉద్యోగం చేయించాలని డిమాండ్ చేశారు.









