ఉద్యమం ముసుగులో మాజీ సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలు, ఉద్యమకారులను తీవ్రంగా మోసం చేశారని మాజీ ఎంపీ రవీంద్రనాయక్(Ravindra Naik) ఆరోపించారు. ఆయ న బాధితులు చాలామంది ఉన్నారని, టీఆర్ఎస్ ఆవిర్భావ సభ్యుడిగా ఉన్న తనను తెలంగాణ భవన్ నుంచి బయటకు గెంటేశారని అన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అప్పుల పాల్జేసిన ఘనత ఒక్క కేసీఆర్కే దక్కుతుందని, పదేళ్లలో సుమారు రూ.8 లక్షల కోట్లు అప్పులు చేశారని తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి ప్రజాపాలన చేస్తున్నారని, ఆయనకు రాష్ట్రప్రజలు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
ఎంతోమంది నాయకుల రాజకీయ భవిష్యత్తుతో ఆడుకొని, వారిని పార్టీ నుంచి బయటకు పంపారని.. గిరిజనులు, మహిళలకు టికెట్లు ఇవ్వలేదన్నారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత క్విడ్ప్రో పేరుతో వేలాది ఎకరాల అసైన్డ్, నయీం, దేవాదాయ, వక్ఫ్, మిగులు భూములు కబ్జా చేయడమే కాకుండా వాటిని మాయం చేశారని ఆరోపించారు. ఆయన వల్లనే కూతురు కవిత(Kavitha) జైలు పాలైందని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో వందల సంఖ్యలో చెరువులు కనుమరుగయ్యాయని, మళ్లీ కేసీఆర్ కుటుంబంలో ఎవరు సీఎం అయినా తెలంగాణ నాశనం తప్పదని పేర్కొన్నారు. కేసీఆర్ కుట్రలు, కుతంత్రాలను అడ్డుకుందామని ఆయన పిలుపునిచ్చారు.