AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా అస్తమయం

ప్రముఖ వ్యాపారవేత్త, టాటా గ్రూప్ ఛైర్మన్‌ రతన్‌ టాటా (86) కన్నుమూశారు. వయోభారంతో  కొన్ని రోజులుగా ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రతన్ టాటా.. బుధవారం (అక్టోబర్ 09న)   రాత్రి తుదిశ్వాస విడిచారు. సోమవారం (అక్టోబర్ 07న) రోజున వయోభారానికి సంబంధించిన పలు అనారోగ్య సమస్యల కారణంగా.. ఆస్పత్రిలో చేరిన రతన్ టాటా ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుండటంతో.. ఆయనను ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచి చికిత్స అందించారు. అయితే.. రతన్ టాటా పరిస్థితి పూర్తిగా విషమించటంతో చికిత్స పొందుతూనే ప్రాణాలు వదిలారు.

రతన్ టాటా 1991లో ‘టాటా సన్స్’ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. వందేళ్ల కిందట తన ముత్తాత స్థాపించిన గ్రూప్‌ను 2012 వరకు ఎంతో విజయవంతంగా నడిపారు రతన్ టాటా. 1996లో టెలి కమ్యూనికేషన్స్ కంపెనీ అయిన టాటా టెలిసర్వీసెస్‌ను, 2004లో ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ని ప్రారంభించి.. పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక అడుగులు వేశారు. టాటా గ్రూప్ సంస్థను ఉన్నత శిఖరాలకు చేర్చడంలో రతన్ టాటా కీలక పాత్ర పోషించారు. రతన్ టాటా నాయకత్వంలో, టాటా గ్రూప్స్ సంస్థ.. 100 బిలియన్ డాలర్ల విలువైన ప్రపంచ వ్యాపార సామ్రాజ్యంగా ఎదిగింది. తన వ్యాపారాలన్నింటినీ ఎంతో విజయవంతంగా నడిపిస్తూ.. దేశంలోని గొప్ప పారిశ్రామిక వేత్తల్లో ఒకరిగా రతన్ టాటా పేరు సంపాదించుకున్నారు. దిగ్గజ పారిశ్రామికవేత్తగానే కాకుండా.. రతన్ టాటా అంతకుమించి గొప్ప మానవతావాది కూడా .

86 ఏళ్లు ఉన్న రతన్ టాటా.. చివరి దశలో గౌరవ ఛైర్మన్ హోదాలో కొనసాగారు. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ.. టాటా సన్స్‌కు కూడా గతంలో ఛైర్మన్‌గా ఉన్నారు. టాటా గ్రూప్‌ ఛారిటబుల్ ట్రస్టులకు మాత్రం రతన్ టాటా నాయకత్వం వహించారు. ఇక.. బిజినెస్ టైకూన్‌గా పేరు తెచ్చుకున్న రతన్ టాటాను.. 2008లో దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మ విభూషణ్‌తో అప్పటి కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. అంతకు ముందు.. 2000లోనే రతన్ టాటాను పద్మ భూషణ్ వరించింది.

ANN TOP 10