కేఏ పాల్కు షాక్
విచారణ 14కు వాయిదా..
(అమ్మన్యూస్, హైదరాబాద్):
రాష్ట్రంలో హైడ్రా కూల్చివేతలపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. జీవో నెంబర్ 99పై స్టే విధించాలంటూ ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరుగగా.. హైడ్రా కూల్చివేతలు తక్షణమే ఆపేయాలని పాల్ వాదనలు వినిపించారు. అయితే ఇప్పటికిప్పుడు కూల్చివేతలు ఆపలేమని న్యాయస్థానం వెల్లడించింది. హైడ్రా కు చట్టబద్దత కల్పించిన తరువాతే యాక్షన్ మొదలు పెట్టాలని పార్టీ ఇన్∙పర్సన్గా కేఏ పాల్ వాదనలు వినిపించారు. అక్రమ కట్టడాలు కూల్చివేతలకు 30 రోజులు ముందే నోటీసులు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. వాదనలు విన్న హైకోర్టు.. ప్రతివాదులుగా హైడ్రా, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ ధాఖలు చేయాలని హైకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 14కు వాయిదా వేసింది.
జూలై 19న హైడ్రా ఏర్పాటు..
కాగా.. తెలంగాణ ప్రభుత్వం ఈఏడాది జూలై 19న జీవో 99 ద్వారా హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రంగంలోకి దిగిన హైడ్రా ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్న అనేక అక్రమ నిర్మాణాలు కూల్చివేసింది. మొదట్లో హైడ్రాకు అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ రానురాను హైడ్రాపై నిరసనలు వెల్లువెత్తాయి. పలు చోట్ల హైడ్రా కూల్చివేతలను స్థానికులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. హైడ్రాకు చట్టబద్ధత ఉందా, లేదా? అని కొంతమంది ప్రశ్నలు సంధించారు. హైడ్రాను నిలిపివేయాలంటూ అనేక మంది న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. జోవో 99పై స్టే విధించాలంటూ పట్టుబడుతున్నారు.