AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘మూసీ’కి పర్యాటక శోభ.. చారిత్రాత్మ‌క భ‌వ‌నాల‌ను ప‌ర్యాట‌క ప్రాంతాలుగా తీర్చిదిద్దుతాం : సీఎం రేవంత్ రెడ్డి

మూసీ న‌ది ప‌రివాహ‌క ప్రాంతంలో ఉన్న చారిత్రాత్మ‌క భ‌వ‌నాల‌ను ప‌ర్యాట‌క ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామ‌ని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాల పరిరక్షణ కు ముందుకు రావాలని ఆయన పారిశ్రామికవేత్తలకు సూచించారు. హైదరాబాద్‌లోని పలు పురాతన మెట్ల బావుల పునరుద్ధరణ కోసం సీఐఐతో రాష్ట్ర పర్యాటక శాఖ శుక్రవారం ఒప్పందం చేసుకుంది.

ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రస్తుతం పాత అసెంబ్లీ భవనాన్ని పునరుద్దరిస్తున్నామని, త్వరలోనే అందులో శాసన మండలి ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ప్రస్తుతం శాసనమండలి ఉన్న జూబ్లీ హాల్‌కు చారిత్ర‌క ప్రాధాన్యత ఉందన్నారు. ప్రత్యేక టెక్నాలజీతో ఆ భవనాన్ని నిర్మించారని, భవిష్యత్తులో దాన్ని పరిరక్షించాల్సిన అవసరముందని సీఎం అభిప్రాయ‌ప‌డ్డారు. జూబ్లీహాల్‌ను దత్తత తీసుకొని పరిరక్షించాలని ఆయన సీఐఐకి సూచించారు. ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని పరిరక్షిస్తామని, ఇందుకోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉస్మానియా ఆస్పత్రిని గోషామహల్ స్టేడియానికి తరలిస్తున్నట్లు సీఎం వివరించారు. హైకోర్టు భవనాన్ని కూడా రక్షించాల్సిన అవసరముందని సీఎం అన్నారు. రాజేంద్రనగర్‌లో హైకోర్టు నూతన భవనం నిర్మాణం కోసం 100 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. హైదరాబాద్ సిటీ కాలేజ్ భవనంతో పాటు పురానాపూల్ బ్రిడ్జి వంటి చారిత్రక కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన అవసర‌ముందన్నారు. ఇప్పటికే చార్మినార్ పరిరక్షణ ప్రాజెక్ట్ కొనసాగుతోందన్నారు.

పురాతన బావులు దత్తత తీసుకున్న పారిశ్రామికవేత్తలు

నగరంలో పురాతన మెట్ల బావులను పునరుద్ధరించి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దడానికి పలువురు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. ఈ మేర‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వారు ఒప్పంద పత్రాలు అందజేశారు. ఉస్మానియా యూనివర్సిటీలోని మహాలఖా మెట్ల బావి పునరుద్దరణకు ఇన్పోసిస్ సంస్థ ఒప్పందం చేసుకుంది. మంచిరేవుల మెట్ల బావిని సాయి లైఫ్ సంస్థ దత్తత తీసుకుంది. భారత్ బయోటెక్  సంస్థ సాలార్ జంగ్, అమ్మపల్లి  బావుల‌ను పునరుద్దరించనున్నది. అడిక్‌మెట్ మెట్ల బావిని దొడ్ల డైరీ, ఫలక్‌నుమా మెట్ల బావిని టీజీ ఆర్టీసీ, రెసిడెన్సీ మెట్ల బావిని కోఠి ఉమెన్స్ కాలేజీ పునరుద్దరించనున్నది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు, టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీప్రసాద్, సీఐఐ తెలంగాణ ఛైర్మన్ సాయి ప్రసాద్, ముఖ్యమంత్రి ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి అజిత్ రెడ్డి, ముఖ్య‌మంత్రి ఓఎస్డీ వేముల శ్రీనివాసులు పాల్గొన్నారు.

ANN TOP 10