భారీ కుంభకోణానికి రేవంత్ సర్కార్ కుట్ర
(అమ్మన్యూస్, హైదరాబాద్):
మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ కుంభకోణం చేసేందుకు తెర లేపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ మేరకు హైదరాబాద్లోని ఫతేనగర్, కూకట్పల్లిలోని మురుగు నీటి శుద్ధి కేంద్రాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. మూసీ ప్రాజెక్టుకు రూ.లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టే అవసరం ఉందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇక, మూసీ టెండర్లను పాకిస్తాన్ కంపెనీలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు.
ఫతేనగర్ ఎస్టీపీల్లో(మురుగు శుద్ధి కేంద్రం) శుద్ధి చేసిన నీరంతా మూసీ నదిలోకి వెళ్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. దాదాపు 94శాతం స్వచ్ఛమైన నీరు మూసీలోకి వెళ్తున్నపుడు మళ్లీ మూసీ శుద్ధి ఎందుకని కేటీఆర్ నిలదీశారు.
శుద్ధి కేంద్రాలపై పట్టింపేది?
మురుగు శుద్ధి కేంద్రాల నిర్మాణాలపై కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పెండింగ్ పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. అనంతరం కూకట్పల్లి ఎస్టీపీని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
హైదరాబాద్ను మురుగు నీటి రహిత నగరంగా మార్చాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్టీపీలను ప్రారంభించినట్లు కేటీఆర్ గుర్తు చేశారు. ఇందులో భాగంగానే రూ.3,866 కోట్లతో 31 ఎస్టీపీల నిర్మాణాలను చేపట్టినట్లు తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూసీ సుందరీకరణ పేరుతో రూ.వేల కోట్ల స్కాంకు తెర లేపిందని కేటీఆర్ ఆరోపించారు. అనంతరం కూకట్పల్లి నాలాను పరిశీలించారు.ఈ మేరకు నాలాను శుద్ధి చేయాలని అధికారులను కోరారు.
హామీలు గాలికేనా?
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలను నెరవేర్చడంలేదని కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యంగా డబుల్ బెడ్రూం విషయంలో ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసం చేశారన్నారు. ఇక, హైడ్రా పేరుతో పేదలకు ఒక న్యాయం, ధనవంతులకు మరో న్యాయం చేస్తున్నారని విమర్శలు చేశారు. అలాగే ఎస్టీపీల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని చెప్పారు.