AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘మూసీ’ నిర్వాసితులకు ‘డబుల్‌’ ఇళ్లు: సీఎం రేవంత్‌రెడ్డి

మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ బాధితులకు ఊరట.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

హైదరాబాద్: హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటైన ‘హైడ్రా’ మరోసారి దూకుడు ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో అక్రమంగా నిర్మించిన రూ.కోట్ల విలువైన విల్లాలను నేలమట్టం చేస్తోంది. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అభివృద్ధిలో భాగంగా నిర్వాసితులయ్యే 16వేల బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్ రూం గృహాలను కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇవాళ( మంగళవారం) ఉత్తర్వులు జారీ చేసింది.

మూసీ రివర్ బెడ్, బఫర్ జోన్‌లో ఉన్న నిర్మాణాలకు పునరావాసం కల్పించేందుకు వీటిని ఉపయోగిస్తారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే అధికారులు చేపట్టిన సర్వే ప్రకారం 10,200 మందిని నిర్వాసితులుగా గుర్తించారు. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌.. మూడు జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారుల బృందాలు రేపు(బుధవారం) ఇంటింటికీ వెళ్లి అక్కడున్న ప్రజలకు ఎక్కడెక్కడ డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించారో అధికారులు తెలియజేయనున్నారు.

ముందుగా మూసీ రివర్ బెడ్‌లో ఆక్రమణలో ఉన్న 1600 ఇళ్లను తొలగించి.. అక్కడ ఉన్న బాధితులను డబుల్ బెడ్ రూం ఉన్న ప్రాంతాలకు తరలించనున్నారు. మూసీ బఫర్ జోన్‌లో నివసించే వ్యక్తులు, నిర్మాణాలకు RFCTLARR చట్టం ప్రకారం రేవంత్ ప్రభుత్వం పరిహారం అందజేయనుంది. నిర్మాణ ఖర్చుతో పాటు, వారికి పట్టా ఉంటే భూమి విలువను పరిహారంగా చెల్లించనుంది. వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించనుంది.

మూసీ బాధిత ప్రజలందరికీ చట్టప్రకారం పునరావాసం కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే భరోసా కల్పించారు. ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధికారులతో కలిసి మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నిర్వాసితులను సంప్రదించి పునరావాసం కల్పించే ప్రక్రియను రేపు(బుధవారం) కలెక్టర్లు ప్రారంభించనున్నారు.

మరోవైపు.. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్, హైదరాబాద్ మెట్రో రైలుపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ( మంగళవారం) సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి MA&UD ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సలహాదారు శ్రీనివాసరాజు, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, సర్ఫరాజ్ అహ్మద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ హజరయ్యారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ANN TOP 10