బీసీ కులగణన, వర్సిటీల పేర్లు మార్పుపై నిర్ణయం
పలు కీలక అంశాలపై చర్చ
(అమ్మన్యూస్, హైదరాబాద్):
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు భేటీ సెక్రటేరియట్లో జరిగే ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో అక్రమార్కులకు నిద్రలేకుండా చేస్తోన్న హైడ్రాకు చట్టబద్దత కల్పించేలా ఆర్డినెన్సు తీసుకురానున్నారని సమాచారం. అలాగే, ధరణిపై ప్రభుత్వం వేసిన కమిటీ సిఫార్సులపై చర్చించి.. నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, పలు వర్సిటీలకు కొత్త పేర్లు పెట్టాలని ఇటీవలే ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, బీసీ గణనపై కూడా క్యాబినెట్ ఆమోదం తెలపనుంది.
హైదరాబాద్లోని తెలుగు యూనివర్సిటీకి ప్రముఖ కవి, రచయిత సురవరం ప్రతాపరెడ్డి పేరు, మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు, పోర్త్ సిటీలో ఏర్పాటు చేస్తున్న ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్ టైల్స్కు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటికి సంబంధించి మంత్రి వర్గం ఆమోదముద్ర వేయనుంది. కొత్తగా 225 గ్రామ పంచాయతీల ఏర్పాటు, ఔటర్ రింగు రోడ్డు పరిధిలోని మునిసిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనంపైనా కేబినెట్లో చర్చించనున్నట్లు తెలుస్తోంది
వీటితో పాటు వరద సహాయక చర్యలు, రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, రైతు రుణ మాఫీ, రైతు భరోసా వంటి అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. ఎజెండా లిస్ట్ పెద్దదిగా ఉన్న నేపథ్యంలో మంత్రివర్గ భేటీ సుదీర్ఘంగా కొనసాగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇటీవలి ఖమ్మం, నల్లగొండ జిల్లాలో సంభవించిన వరదల వల్ల దాదాపు రూ.10 వేల కోట్లకు పైగా పంట, ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం లెక్క తేల్చింది.