సంచలన నిర్ణయాలతో దూసుకుపోతూ.. పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా మరో కీలక ముందడుగు వేసేలా రేవంత్ రెడ్డి సర్కార్ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే భారీ పెట్టుబడులకు, బడా బడా కంపెనీల స్థాపనకు కేంద్రంగా మారిన తెలంగాణలో.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీలకు కూడా ప్రోత్సాహం అందించేలా.. కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ క్రమంలోనే.. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (MSME) కోసం బుధవారం (సెప్టెంబర్ 18న) రోజున.. కొత్త పాలసీని ప్రభుత్వం విడుదల చేయనుంది. రేపు ఉదయం 11 గంటలకు ఎంఎస్ఎంఈ కొత్త పాలసీని సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు.
తెలంగాణలో వ్యాపారాలు, పెట్టుబడుల విస్తరణను మరింత సులభతరం చేసేలా.. పారిశ్రామిక వేత్తల అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందించున్నట్టు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో ప్రకటించారు. అమెరికాలో ఉన్నట్టుగానే.. తెలంగాణకు కూడా చాలా వ్యాపారావకాశాలు ఉన్నాయని ప్రస్తావించిన సీఎం రేవంత్ రెడ్డి.. చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలనే సంకల్పంతోనే కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకురాబోతున్నట్టు గతంలో అభిప్రాయపడ్డారు. ఇందుకోసం.. రాష్ట్రంలో ఆరు నూతన పాలసీలను తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు.
ఇందులో భాగంగానే.. ఎంఎస్ఎంఈ పాలసీ, ఎగుమతి విధానం, కొత్త లైఫ్ సైన్సెస్ పాలసీ, రివైజ్డ్ ఈవీ పాలసీ, మెడికల్ టూరిజం పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ అనే ఆరు కొత్త పాలసీలను రూపొందించాలని గతంలో జరిగిన సమీక్షలో సంబంధిత అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే.. రేపు ఎంఎస్ఎంఈ కొత్త పాలసీని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించబోతోంది.