AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రాణి కుముదిని

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రాణి కుముదిని నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆ పదవిలో పార్థసారధి కొనసాగారు. ఆయన పదవీకాలం ఇటీవల ముగియడంతో రాణి కుముదిని ప్రభుత్వం నియమించింది. 1988 బ్యాచ్‌కు చెందిన కుమిదిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్ర సర్వీసుల అనంతరం తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు చేపట్టారు. 2023 ఎన్నికలకు ముందు పదవీ విరమణ చేశారు. నాటి కేసీఆర్‌ ప్రభుత్వం ఆమెని తిరిగి అదే హోదాలో కొనసాగించింది.

ఇప్పటి వరకు ఎస్‌ఈసీగా ఉన్న పార్థసారధి పదవీ కాలం ఈ నెల ఎనిమిదో తేదీతో ముగిసింది. దీంతో ఎస్‌ఈసీగా రాణి కుమిదినిని కాంగ్రెస్‌ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గవర్నర్‌ జిష్టుదేవ్‌ వర్మ ఆదేశాలు జారీ చేశారు. మూడేళ్ల పాటు ఆమె ఎస్‌ఈసీగా కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నూతన ఎస్‌ఈసీ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది.

కాగా, రాష్ట్ర విజిలెన్స్‌ కమిషనర్‌గా విశ్రాంత ఐఏఎస్‌ ఎంజీ గోపాల్‌ను ప్రభుత్వం నియమించింది. 1983 బ్యాచ్‌కు చెందిన గోపాల్‌ ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయనను రాష్ట్ర విజిలెన్స్‌ కమిషనర్‌గా మూడేళ్ల పాటు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ANN TOP 10