సీఎం రేవంత్ను విమర్శిస్తే సహించం
(అమ్మన్యూస్, హైదరాబాద్):
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తమ నాయకుడు, సీఎం రేవంత్ రెడ్డి జోలికొస్తే నాలుక కోస్తామని హెచ్చరించారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. గాంధీ, కౌశిక్ వివాదం బీఆర్ఎస్ పంచాయితీ అని, కాంగ్రెస్ కార్యకర్తలను ఎందుకు రెచ్చగొడుతున్నారని ప్రశ్నించారు. ఏదైనా పబ్లిక్ ఇష్యూ ఉంటే మాట్లాడాలి కానీ, బీఆర్ఎస్ గొడవలోకి ప్రభుత్వాన్ని ఎందుకు లాగుతున్నారని నిలదీశారు. కాంగ్రెస్ జోలికొస్తే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. పొలిటికల్ పవర్ పోవడంతో కేటీఆర్కు, బీఆర్ఎస్ నేతలకి ఏమీ అర్థం కావడం లేదన్నారు. అందుకే కేసీఆర్ ఫ్యామిలీ రోడ్లపై పడి దూకుతున్నారని అన్నారు.
ఇప్పుడు ప్రాంతీయవాదమా?..
అలాగే లోకల్–నాన్–లోకల్ కామెంట్లపై మాట్లాడుతూ 10 ఏళ్లు అనుభవించిన తర్వాత ఇప్పుడు ప్రాంతీయవాదం అంటూ మాట్లాడడం నిజంగా విడ్డూరమన్నారు. అసలు పార్టీల్లో కండువా కప్పే సంప్రదాయాన్ని తెచ్చిందే కేసీఆర్ అని, పార్టీలు మారిన వాళ్లకి ఆయన మంత్రి పదవులు కూడా కట్టబెట్టారని గుర్తు చేశారు. అలాంటప్పుడు ఈ వివాదంలో ముందుగా సమాధానం చెప్పాల్పింది కూడా ఆయనే అని వ్యాఖ్యానించారు. అనంతరం ఇరువురి ఇళ్ల వద్ద పోలీసు బందోబస్తుపై కూడా జగ్గారెడ్డి స్పందించారు. వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయని, ఇలాంటి టైంలో పోలీసులు వినాయక ఉత్సవాలు చూసుకోవాలా? బీఆర్ఎస్ నేతల పంచాయితీ చూడాలా? అని జగ్గారెడ్డి మండిపడ్డారు.