ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన టీపీసీసీ చీఫ్
(అమ్మన్యూస్, హైదరాబాద్):
తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఒకవేళ వచ్చినా కాంగ్రెస్ ఖాతాలోనే చేరుతాయని టీపీసీసీ చీఫ్ తేల్చిచెప్పారు. తెలంగాణలో ఉపఎన్నికలు రాబోతున్నాయంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. గురువారం ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… 60 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్న మహా నాయకుడు ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్నారని.. ఖర్గేను కలిసి ఆశీస్సులు తీసుకున్నానని అన్నారు. అన్ని వర్గాలను కలుపుకొని కాంగ్రెస్ బలోపేతానికి పనిచేయాలని ఖర్గే సూచన చేశారన్నారు.
మళ్లీ వచ్చేది మా ప్రభుత్వమే..
కాంగ్రెస్ కార్యకర్త మొదలుకొని సీనియర్ నాయకులను కలుపుకొని వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు వచ్చిన స్థానాలకంటే ఎక్కువ సాధించి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా పనిచేయబోతున్నామన్నారు. మంత్రివర్గ విస్తరణ గురించి సీఎం, ఏఐసీసీ పెద్దలు మాట్లాడారని.. వారే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. కొత్త కమిటీ ఏర్పాటు అయ్యేంత వరకు పాత కమిటీలు పనిచేస్తాయన్నారు. బాధ్యతలు చేపట్టాక కొత్త కార్యవర్గంపై అధిష్టానంతో చర్చలు జరుపుతానని చెప్పారు. ప్రజలు నమ్మకంతో కాంగ్రెస్కు అధికారాన్ని ఇచ్చారని.. సమన్వయంతో పనిచేస్తున్నామని తెలిపారు.