రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా సంభవించిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందం బుధవారం రాష్ట్రానికి చేరుకుంది. ప్రభావిత ప్రాంతాల్లో సంభవించిన వరద నష్టంపై కేంద్ర బృందానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నివేదించారు. కర్నల్ కేపీ సింగ్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం సీఎస్, ప్రభుత్వ సీనియర్ అధికారులతో చర్చలు జరిపింది. అతి తక్కువ సమయంలో వాతావరణ శాఖ అందించిన హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవడంతో ప్రాణనష్టం తగ్గించగలిగామని సీఎస్ చెప్పారు.
సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు పరిస్థితిని సమీక్షించి, వరద, పునరావాస, సహాయక చర్యలను పర్యవేక్షించారని సీఎస్ చెప్పారు. సహాయక చర్యలు చేపట్టేందుకు డిప్యూటీ సీఎంతో పాటు మరో ఇద్దరు రాష్ట్రమంత్రులు హుటాహుటిన ఖమ్మం చేరుకొని సహాయక కార్యక్రమాలను వేగవంతం చేశారని, ఆయా జిల్లాల్లో అధికార యంత్రాంగానికి వరద సహాయం, పునరావాస కార్యక్రమాలకు సంబంధించి నిధులు వెంటనే విడుదల చేశామని సీఎస్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలను అందించడానికి వీలుగా మార్గదర్శకాలను రూపొందించాలని కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఎన్డీఆర్ఎఫ్తో సమానంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. ప్రత్యేక బృందాలకు శిక్షణ, ఇతర లాజిస్టిక్స్ ఏర్పాట్లలో ఎన్డీఎంఏ మద్దతు కావాలని కోరారు. భారీ వర్షాల సమయంలో ఎయిర్ రెస్క్యూ ఆపరేషన్ల సమస్యను సీఎస్ ప్రస్తావించారు. సవాళ్లు ఎదుర్కోవడంలో కేంద్రం సహకారాన్ని కోరారు.
ఏటూరునాగారం అటవీ ప్రాంతంలో 332 హెక్టార్ల విస్తీర్ణంలో భారీ చెట్లు కూలిన సంఘటనలను, పర్యావరణ విపత్తు సమస్యను ప్రస్తావించారు. విపత్తుకు మూల కారణాలు తెలుసుకునేందుకు సమగ్ర అధ్యయనం చేయాలని కేంద్ర బృందం సీఎస్కు సూచించింది. విపత్తు నిర్వహణశాఖ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ వరదల కారణంగా సంభవించిన నష్టాలను, ఆపదలో ఉన్న ప్రజలకు తక్షణ సహాయం అందించడానికి ప్రభుత్వం చేసిన కృషిని కేంద్ర బృందానికి వివరించారు.