AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేవంత్‌తో పవన్‌ కల్యాణ్‌ భేటీ.. హైడ్రాపై ఆరా.. వరద బాధితులకు భారీ విరాళం

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిని కలిశారు. బుధవారం ఉదయం జూబ్లీహిల్స్‌ లోని రేవంత్‌ నివాసానికి వెళ్లిన పవన్‌ కల్యాణ్‌.. రూ. కోటి చెక్కును సీఎం సహాయ నిధికి అందజేశారు. తొలుత పవన్‌ కల్యాణ్‌ ను రేవంత్‌ రెడ్డి సాదరంగా ఆహ్వానించి శాలుతో సన్మానించారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు, ఇతర అంశాలపై వారి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. అదేవిధంగా తెలంగాణలో హైడ్రా గురించి రేవంత్‌ రెడ్డిని అడిగి పవన్‌ వివరాలు తెలుసుకున్నట్లు తెలిసింది. హైడ్రా ఏర్పాటు, దాని పనితీరును పవన్‌ కు రేవంత్‌ రెడ్డి వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనూ హైడ్రా లాంటి వ్యవస్థ ఏర్పాటుపై సీఎం చంద్రబాబు ఆలోచిస్తున్నారని పవన్‌ చెప్పినట్లు సమాచారం.

రూ. కోటి విరాళం
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలకుతోడు నదులు, మున్నేరు ఉప్పొంగడంతో వరదలు సంభవించాయి. ఈ క్రమంలో ఏపీలో విజయవాడను బుడమేరు ముంచెత్తగా.. తెలంగాణలో మున్నేరుకు రికార్డు స్థాయిలో వరదనీరు చేరింది. మున్నేరు పరివాహక ప్రాంతమైన ఖమ్మం నగరంలో కొంతభాగం నీటమునిగింది. గతంలో ఎప్పుడూలేని విధంగా వరదలు రావడంతో ముంపు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరద ముంపు ప్రాంతాల్లో సహాయార్ధం ఇరు రాష్ట్రాల సీఎంల సహాయ నిధికి పవన్‌ కల్యాణ్‌ రూ.కోటి చొప్పున ప్రకటించారు. గత రెండు రోజుల క్రితం ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన పవన్‌ ఏపీ సీఎం సహాయ నిధికి రూ. కోటి చెక్కును అందజేశారు. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసి సీఎం సహాయ నిధికి రూ. కోటి చెక్కును అందజేశారు. రేవంత్‌ రెడ్డిని కలిసినవారిలో పవన్‌ తోపాటు తెలంగాణ జనసేన నాయకులు కూడా ఉన్నారు.

ANN TOP 10