– ఐఐహెచ్టీని ప్రారంభించిన సీఎం
– త్యాగం అంటే లక్ష్మణ్ బాపూజీదే అంటూ కీలక వ్యాఖ్యలు
(అమ్మన్యూస్, హైదరాబాద్):
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం నాంపల్లిలో ఐఐహెచ్టీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ) వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. నగరంలోనే ఐఐహెచ్టీని ప్రారంభించడం సంతోషకరమని అన్నారు. తెలంగాణ విద్యార్థులు ఏపీ, ఒడిశా రాష్ట్రాలకు వెళ్లి హ్యాండ్లూమ్ కోర్సులు చదవాల్సి వస్తోందని అన్నారు. ఇప్పుడు ఆ బాధలు తప్పాయన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో మాట్లాడి ఐఐహెచ్టీకి అనుమతులు తెచుకున్నామని ఈ సందర్భంగా వెల్లడించారు. విద్యార్థుల సమయం వృథా కాకూడదని, తెలుగు యూనివర్శిటీలో ఐఐహెచ్టీలో ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభిస్తామని చెప్పారు. వచ్చే ఏడాది ఐఐహెచ్టీని స్కిల్ యూనివర్సిటీకి తరలిస్తామని చెప్పారు. ఒక్కో విద్యార్థికి నెలకు 2500 స్టై ఫండ్ ఇస్తామని హామీ ఇచ్చారు.
గత పాలనలో నేతన్నల రాత మారలేదు..
‘గతంలో సినీ తళుకు బెళుకులు కూడా చేనేతకి తెచ్చారు. కానీ నేతన్నల రాత మారలేదు. గతంలో సిరిసిల్లలో కార్మికులకు బకాయిలు పెట్టారు. ఆ మొత్తం మేము అధికారంలోకి వచ్చాక విడుదల చేశాం. బతుకమ్మ చీరలకు కట్టుకునే స్థాయిలో నాణ్యత లేవు. మంచి డిజైన్తో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు ఒక్కొక్కరి ఏడాదికి 2 చీరలు ఇస్తాం. బతుకమ్మ చీరలు ఆగిపోయాయని ఆలోంచాల్సిన అవసరం లేదు’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
నేతన్నలకు రుణమాఫీ ఇస్తున్నాం
నేతన్నలకు రుణమాఫీ ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రుణమాఫీకి ఇప్పుడే ఆదేశాలు ఇస్తున్నామని అన్నారు. ‘‘ మీ సమస్యల పరిష్కారానికి మీ అన్నగా ఎప్పుడు ముందు ఉంటా. కొడంగల్ నియోజక వర్గంలోని నేతన్నలతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. నేతన్న కొండా లక్ష్మణ్ బాపూజీ వారసులు. త్యాగాలు చేస్తే ఎలా వేలాది కోట్ల ఆస్తులు సంపాదించారు. పదవిని తృణప్రాయంగా త్యాగం చేసింది కొండా లక్ష్మణ్ బాపూజీ’’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఐఐహెచ్టీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.