AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నాలుగు వారాలు డెడ్‌లైన్‌.. అసెంబ్లీ స్పీకర్‌ కార్యదర్శికి హైకోర్టు కీలక ఆదేశాలు

– పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తీర్పు

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ కార్యాలయాన్ని ఆదేశించింది. ఒకవేళ నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా స్వీకరించి విచారణ చేపడుతామని చెప్పింది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ బీ ఫామ్‌ మీద ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై వాదనలను ముగించిన హైకోర్టు సోమవారం తీర్పును వెలువరించింది.

ఈ ముగ్గురిపై..
ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వాలంటూ బీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు కేపీ వివేకానందగౌడ్, పాడి కౌశిక్‌రెడ్డి వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పార్టీని ఫిరాయించినందుకు ఆ ముగ్గురు ఎమ్మెల్యేలను డిస్‌క్వాలిఫై చేయాలంటూ స్పీకర్‌కు పార్టీ తరపున నోటీసులు ఇచ్చామని చెప్పారు. అయినా ఇప్పటి వరకు అసెంబ్లీ స్పీకర్‌ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని వారు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు.
కీలక ఆదేశాలు..
ఈ పిటిషన్లపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఎప్పుడు ఇస్తారు..? ఎప్పటి వరకు వాదనలు వింటారు..? ప్రోసిడింగ్స్‌ ఎప్పుడు పూర్తవుతుందనే.. నాలుగు వారాల్లోగా షెడ్యూల్‌ చేయాలని స్పీకర్‌ కార్యదర్శిని ఆదేశించింది. ప్రోసిడింగ్స్‌ అనంతరం స్టేటర్‌ రిపోర్టు ఇవ్వాలని ధర్మాసనం వెల్లడించింది. లేకుంటే తామే సమోటోగా విచారణ జరపుతామని హైకోర్టు ధర్మాసనం హెచ్చరించింది.

ANN TOP 10