ఇటీవల ఖమ్మం పట్టణాన్ని వరదలు అతలాకుతలం చేయడం తెలిసిందే. శనివారం మళ్లీ ఖమ్మం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురవడంతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంటనే ఖమ్మం బయల్దేరి వెళ్లారు.
మున్నేరు వాగు మరోసారి పొంగి పొర్లే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో భట్టి విక్రమార్క అధికారులను అప్రమత్తం చేశారు. ఖమ్మం జిల్లాలో ఇవాళ ఒక్కరోజే 15 సెం.మీ వర్షపాతం నమోదు కావడంతో, మున్నేరుకు భారీ వరద వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ముందుజాగ్రత్తగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. కాగా, మున్నేరులో నీటి ప్రవాహం అంతకంతకు పెరుగుతుండడం పట్ల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
మున్నేరు వరద సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. మున్నేరు వరద ఉధృతి ఖమ్మంలో బీభత్సం చేసింది. జనజీవనం స్తంభించిపోయింది. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. మున్నేరు వరద ఉధృతిలో సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. ఇప్పుడిప్పుడే దాన్ని నుంచి తేరుకుంటున్న వదర బాధితులకు మరో షాక్.
మున్నేరు వరద ఉధృతి మళ్లీ పెరుగుతోంది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మళ్లీ ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుంనని హడలిపోతున్నారు. మరోవైపు వరద ఉధృతి పెరగడంతో అధికార యంత్రాంగం అలర్ట్ అయ్యింది. పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని అధికారులను ఆదేశించింది. ముందస్తు చర్యలు చేపట్టారు అధికారులు.
మున్నేరు వాగుకి భారీగా వరద వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచించారు. వరద ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో జిల్లాలోని ఉన్నత స్థాయి అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.