తెలంగాణ పీసీసీ చీఫ్గా నియమితులైన మహేష్ కుమార్ గౌడ్కు రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పీసీసీ చీఫ్ బాధ్యతలపై ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తాను పీసీసీ చీఫ్గా ఉన్న కాలంలో చేసిన పనులను రేవంత్ గుర్తు చేసుకున్నారు.
తన పదవీకాలాన్ని గుర్తు చేసుకుంటే చాలా గర్వంగా ఉందన్నారు. ఆ సమయంలో తనకు సహకరించిన పార్టీ నేతలకు, పార్టీ సైనికులకు సీఎం రేవంత్ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బాధ్యతలను మహేష్ కుమార్కు అప్పగించడం ఆనందంగా ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సోనియా గాంధీ తనపై పూర్తి విశ్వాసంతో తనని పీసీసీ చీఫ్ చేశారని, తన పదవీ కాలంలో అత్యంత విలువైన జ్ఞాపకాలున్నాయని సీఎం గుర్తు చేసుకున్నారు.
రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడోయాత్ర మరవలేనిదిగా రేవంత్ పేర్కొన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో భారీగా పార్టీ డిజిటల్ మెంబర్షిప్ డ్రైవ్ చేశామన్నారు. తుక్కుగూడలో కాంగ్రెస్ విజయభేరి సభను రేవంత్ గుర్తు చేసుకున్నారు. తుక్కుగూడ సభ చరిత్రలో అతిపెద్ద ఎన్నికల సమావేశాలలో ఒకటిగా ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అబద్ధాలు, కల్పితాలు, వైఫల్యాలను బహిర్గతం చేయడమే కాకుండా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగామని సీఎం రేవంత్ సంతృప్తి వ్యక్తం చేశారు.