AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేసీఆర్‌ మహాయాగం.. ఫామ్‌హౌస్‌లో సతీమణితో కలిసి ప్రత్యేక పూజలు

కష్టాలు తీరాలని నవగ్రహ పూజ
చవితి తరువాత ‘చంద్రుడి’ విశ్వరూపమేనా?
11న పార్టీ నేతలతో కీలక సమావేశం

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
మాజీ సీఎం కేసీఆర్‌ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో వేద పండితులతో నవగ్రహ మహాయాగం చేపట్టారు. తన సతీమణి శోభతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సమయంలోనూ కేసీఆర్‌ తరచూ యాగాలు చేసేవారు. ఎన్నికల్లో ఓటమి తరువాత ఫాం హౌస్‌కే పరిమితం అవుతున్నారు. ఇక ఈ నెల 11న పార్టీ నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. నేతలకు దిశా నిర్దేశానికి సిద్ధం అవుతున్నారు.

దైవభక్తి ఎక్కువ..
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు ముందు నుంచీ దైవ భక్తి ఎక్కువ. అందుకే.. ప్రతీ ఆధ్యాత్మిక కార్యక్రమంలోనూ పాల్గొంటుంటారు. వీలు చిక్కినప్పుడల్లా యాగాలు సైతం చేస్తుంటారు. తన ఫామ్‌హౌస్‌లో ప్రత్యేక పూజలు, యాగాలు చేపడుతుంటారు. గతంలో 2015లో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చండీయాగం చేశారు. 2018లో మరో దఫా ఎన్నికలకు వెళ్లే ముందు తనకు చెందిన ఎర్రవెల్లి్ల ఫామ్‌హౌస్‌లో రాజశ్యామల యాగం చేశారు. అలాగే.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు నవంబర్‌ 1 నుంచి మూడు రోజులపాటు రాజశ్యామల యాగం అని చేశారు.

కష్టాలు తొలగాలని..
మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్‌ అధికారం కోల్పోవాల్సి వచ్చింది. దాంతో అప్పటి నుంచి ఆయనకు, ఆయన కుటుంబానికి ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వం హయాంలో జరిగిన లోపాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండడంతో అటు న్యాయస్థానాల నుంచి ఇటు కాంగ్రెస్‌ ప్రభుత్వం నుంచి ఇబ్బందులు తప్పడం లేదు. అటు ఆయన తనయ సైతం లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్టయి ఐదు నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు. ఇటు పార్టీ కూడా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. గ్రామ స్థాయి నుంచి, జిల్లా స్థాయి వరకు ఉన్న లీడర్లు పార్టీ నుంచి తప్పుకుంటున్నారు. ఒకప్పుడు పార్టీలో ముఖ్య పదవులు అనుభవించిన వారు కూడా పార్టీ నుంచి తప్పుకున్నారు.

మరో కీలక నిర్ణయం..
అయితే.. ఇటు బీఆర్‌ఎస్‌ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుండడం, అటు కేసులు చుట్టుముడుతుండడంతో కేసీఆర్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వేదపండితుల సూచనల మేరకు తన ఫామ్‌హౌస్‌లో మరో యాగానికి పూనుకున్నారు. ప్రస్తుతం వస్తున్న అన్ని ఇబ్బందుల నుంచి బయటపడేందుకు కేసీఆర్‌ ఈ యాగం చేస్తున్నారట. ఇందులో కేసీఆర్‌ తనయ కవిత కూడా పొల్గొన్నట్లు సమాచారం.

ఈ నెల 18 నుంచి జిల్లా పర్యటనలు..
రైతురుణమాఫీ ప్రధాన అంశంగా ప్రజల్లోకి వెళ్లేలా కేసీఆర్‌ జిల్లా పర్యటనల పైన కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. అదే విధంగా ప్రతీ జిల్లాలోనూ ఆందోళన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలని భావిస్తున్నారు. ఈ మొత్తం కార్యక్రమాల పైన పార్టీ నేతలు కసరత్తు కొనసాగిస్తున్నారు. కేసీఆర్‌ ఈ నెల 18వ తేదీ నుంచి జల్లా పర్యటనలు ఉండనున్నట్లు సమాచారం.

ANN TOP 10