తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడి నియామకం డైలీ సీరియల్ ఎపిసోడ్గా మారింది. అదిగో.. ఇదిగో అంటూ రెండు నెలలుగా నాన్చుతూనే కాలం గడిపేస్తున్నారు. ముఖ్య నేతలు ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడల్లా అదిగో అనౌన్స్మెంట్ అంటూ హంగామా చేయడమే తప్ప… ఆశావహులకు తీపికబురు చెప్పడం లేదు. ఇంతకీ పీసీసీపై పీటముడి వీడకపోడానికి కారణమేంటి? కాంగ్రెస్ అధిష్టానం అంచనాలు ఎలా ఉన్నాయి?
తెలంగాణ కాంగ్రెస్ రథసారథి విషయంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. పీసీసీ చీఫ్గా రేవంత్రెడ్డి మూడేళ్ల కాల పరిమితి ముగియడంతో కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. సామాజిక సమీకరణలను బేరీజు వేసుకొని కొత్త సారథి ఎంపికపై కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండటంతో.. పార్టీ పగ్గాలను ఇతర సామాజిక వర్గాలకు కేటాయించాలని నిర్ణయించింది. అందుకోసం రాష్ట్ర పార్టీ సీనియర్ నేతలను పలుమార్లు ఢిల్లీ పిలిపించి అభిప్రాయాలను తీసుకుంది. పీసీసీ పగ్గాలు బీసీ, ఎస్సీ, ఎస్టీలలో ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలనే దానిపై సుదీర్ఘ మంతనాలు చేసింది. ఫైనల్గా పీసీసీ పీఠాన్ని బీసీ వర్గానికి ఇవ్వాలని డిసైడైంది.
తెలంగాణ పీసీసీ అధ్యక్ష పీఠాన్ని బీసీ సామాజికవర్గం నుంచి ఇద్దరు నేతలు ఆశిస్తున్నారు. ఈ ఇద్దరు తీవ్రంగా పోటీ పడుతుండటంతో అధిష్టానం తేల్చుకోలేకపోతోందని టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ పీసీసీ చీఫ్ కావాలని కలలు కంటున్నారు. ఇద్దరు నేతలు తనకే పదవి కావాలని గట్టిగా పట్టుబడుతున్నట్లు చెబుతున్నారు. ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ తొలి నుంచి పార్టీలో పని చేస్తున్నారు. ఎన్.ఎస్.యూ.ఐలో పని చేసిన అనుభవాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళుతున్నారు. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఆర్గనైజేషన్ ఇన్చార్జిగా సమర్థవంతంగా పని చేస్తున్నందున తనకు ప్రమోషన్ ఇవ్వాలని కోరుతున్నారు. మహేశ్కుమార్ గౌడ్కు సీఎం రేవంత్రెడ్డి మద్దతు ఇస్తున్నట్లు చెబుతున్నారు.