AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కవితకు బెయిల్‌ వచ్చేసిందోచ్‌.. ఇన్నాళ్లకు వీడిన ఉత్కంఠ

బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ
బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పు
ఊపిరిపీల్చుకున్న బీఆర్‌ఎస్‌ శ్రేణులు

(అమ్మన్యూస్, న్యూఢిల్లీ):
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై ఇన్నాళ్లు నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. కవితకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి.. తిహార్‌ జైలులో ఉన్న కవిత బెయిల్‌పై మంగళవారం సర్వోన్నత న్యాయస్థానంలో సుదీర్ఘ విచారణ జరిగింది. మొత్తానికి బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది.

కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణను జస్టిస్‌ బీఆర్‌ గవాయ్, జస్టిస్‌ విశ్వనాథన్‌ ధర్మాసనం నిర్వహించింది. ఢిల్లీ లిక్కర్‌ కేసు విజయ్‌ నాయర్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడటంతో కవిత బెయిల్‌ పిటిషన్‌ కేసు ఏమవుతుందోనన్న ఆందోళన బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో నెలకొంది. ఎట్టకేలకు బెయిల్‌ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ముకుల్‌ రోహత్గీ వాదన ఎంటంటే..
కవిత తరఫున ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈ కేసులో సహ నిందితుడు మనీష్‌ సిసోడియాకు బెయిలు ఇచ్చారని.. ఈడీ, సీబీఐ కేసులో ఇప్పటికే చార్జిషీట్‌ దాఖలు అయ్యిందని పేర్కొన్నారు. దర్యాప్తు ఇప్పటికే పూర్తయిందన్నారు. 57 మంది నిందితులు ఈ కేసులో ఉన్నారన్నారు. కవిత దుర్భల మహిళ కాదు అన్నది నిజం కాదని ముకుల్‌ రోహత్గీ పేర్కొన్నారు. కేసులో 493 మంది సాక్షులను విచారించారని పేర్కొన్నారు. సిసోడియాకు ఇచ్చిన బెయిల్‌ అంశాలే కవితకూ వర్తిస్తాయని ముకుల్‌ రోహత్గీ తెలిపారు. కవిత ఫోన్లలో ఉన్న డేటాను ఉద్దేశపూర్వకంగా ఫార్మాట్‌ చేశారని ఈడీ తరుఫు లాయర్‌ పేర్కొన్నారు. కవిత అసలు దర్యాప్తునకు సహకరించలేదన్నారు. ఫోన్లలో మెసేజ్‌లను డిలీట్‌ చేయడం సహజమే కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఫోన్‌లో డేటా ఎక్కువైనప్పుడు అరేంజ్‌ చేసుకుంటాం కానీ ఫార్మాట్‌ చేయబోమని ఈడీ తరుఫు న్యాయవాది ఎస్వీ రాజు తెలిపారు.

వాడీవేడి వాదనలు
సాక్ష్యాలను బెదిరించారని చెబుతున్నారని.. కానీ ఎక్కడా ఏ కేసూ దానికి సంబంధించి నమోదు కాలేదని ముకుల్‌ రోహత్గీ తెలిపారు. ‘కవిత నిరక్షరాస్యులు కాదు. ఏది మంచి, ఏది చెడు కాదో తెలియదా? అప్రూవర్‌ అరుణ్‌ పిళ్లై ఎందుకు స్టేట్మెంట్‌ ఉపసంహరించుకున్నారు ?’ అని జస్టిస్‌ గవాయి ప్రశ్నించారు. కవితకు సెక్షన్‌ 45 ఎందుకు వర్తించదని ఈడీ, సీబీఐ తరుఫు లాయర్లను జస్టిస్‌ గవాయ్‌ ప్రశ్నించారు. ‘అరుణ్‌ పిళ్లైను కవిత ప్రభావితం చేశారని అంటున్నారు. కానీ ఆ సమయంలో పిళ్లై జైల్లో ఉన్నాడు. ఎలా ప్రభావితం చేస్తారు?’ అని ఈడీ తరుఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. ‘అవును. ఆ సమయంలో పిళ్లై జైల్లోనే ఉన్నారు. కానీ జైల్లో ఉన్నవారిని కూడా ప్రభావితం చేయవచ్చు. జైల్లో కుటుంబ సభ్యులు, న్యాయవాదులు వారిని కలుస్తూనే ఉంటారు. వారి ద్వారా ప్రభావితం చేయవచ్చు’ అని ఈడీ తరుఫు న్యాయవాది ఎస్వీ రాజు తెలిపారు. సుప్రీంకోర్టులో కవిత బెయిల్‌ కేసు విచారణ సందర్భంగా కోర్టుకు బీఆర్‌ఎస్‌ నేతలు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌ రావు, వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి శుభాష్‌ రెడ్డి, ఎంపీ వద్దీరాజు రవిచంద్ర తదితర నేతలు హాజరయ్యారు.

ANN TOP 10