వరద బాధితులకు ఆర్థిక సాయం
రూ.20 లక్షల చెక్కు అందజేత
దుస్తులు, నిత్యావసర సరుకులు సైతం అందించిన మంత్రి
మరోసారి గొప్ప మనసు చాటుకున్న సీతక్క
కన్నీటి గాధలు, కలచివేసే దృశ్యాలు చూసి కన్నీటిపర్యంతం
(అమ్మన్యూస్, వయనాడ్):
ప్రకృతి విలయానికి అతలాకుతలమైన కేరళలోని వయనాడ్ లో తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క శనివారం పర్యటించారు. ములుగు డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ తో కలిసి ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన మంత్రి సీతక్క, బాధిత కుటుంబాల సహాయార్థం తాను సేకరించిన రూ. 20 లక్షల చెక్కును స్థానిక ఎమ్మెల్యే టి. సిద్దికి కి అందించారు. దీంతో పాటు సుమారు పది లక్షల విలువగల దుస్తులు, నిత్యావసర వస్తువులను అందజేశారు. వందల సంఖ్యలో మృతులను సామూహిక ఖననం చేసిన ముండక్కై శ్మశాన వాటికలో మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. అక్కడే మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చే క్రమంలో భావోద్వేగానికి గురయ్యారు మంత్రి సీతక్క.
వయనాడ్ లో జూలై 30న సంభవించిన విపత్తు వందల మందిని బలిగొనగా ఇప్పటి వరకు చాల మంది ఆచూకి లభించ లేదు. గుర్తు పట్టరాని విధంగా మారిన మృతదేహాల నుంచి డీఎన్ఏ లు సేకరించి అక్కడి ప్రభుత్వమే ముండక్కై శ్మశాన వాటికలో సామూహికంగా ఖననం చేసింది. తమ ఆప్తుల చివరి చూపునకు సైతం నోచుకోని ఎందరో పుట్టెడు దుఖంతో ముండక్కై శ్మశాన వాటికలో తమ వారి సమాధులను వెతుక్కుంటున్నారు. తన తల్లిని ఇక్కడే ఖననం చేసారని తెలుసుకున్న ఓ యువతి ఆ ప్రాంతానికి చేరుకుని.. చివరి చూపునకు కూడా నోచుకోలేకపోయాను అంటూ తన తల్లి సమాధి వద్ద బోరున విలపించింది. ఆ యువతి శోకంతో మంత్రి సీతక్క భావోద్వేగానికి లోనైయ్యారు. యువతిని దగ్గరకు తీసుకుని అతి కష్టం మీద ఓదార్చ గలిగారు. అనంతరం స్థానిక మీడియాతో మాట్లాడిన సీతక్క..ఇటువంటి కష్టం ఎవరికీ రావొద్దన్నారు. ప్రభావితమైన ప్రాంతాలను చూసి హృదయం ద్రవించిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పోయిన ప్రాణాలను తీసుకురాలేకపోయినా…తనకు ఎంతో అనుబంధం ఉన్న వయానాడ్ ప్రజలకు నైతిక మద్దతు పలకానికి వచ్చినట్లు తెలిపారు. వాయనాడ్ ఎల్లప్పుడూ తన హృదయానికి దగ్గరగా ఉంటుందన్నారు. నేటికి 24 గంటలూ పనిచేస్తున్న రెస్క్యూ టీమ్లు, స్థానిక అధికారులు, వాలంటీర్ల అవిశ్రాంత ప్రయత్నాలను అభినందిస్తున్నట్లు వెల్లడించారు. విపత్తు వల్ల నష్టపోయిన వారి జీవితాలను పునర్నిర్మించడంలో.. సాధ్యమైన ప్రతి సహాయాన్ని అందిస్తామని మంత్రీ సీతక్క భరోసా ఇచ్చారు.
వయనాడ్తో అనుబంధం..
వయనాడ్ తో మంత్రి సీతక్కకు మంచి అనుబంధం ఉంది. రాహుల్ గాంధి వాయనాడ్ ఎన్నికల ప్రచారంలో సీతక్క విస్తతంగా పాల్గొన్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన చాలా కార్యక్రమాలకు సీతక్క హజరయ్యారు. అంతటి అనుబంధం ఉన్న వయానాడ్ ను ప్రకృతి చిన్నా భిన్నం చేయడంతో..సీతక్క తట్టుకోలేకపోయారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, అధికార కార్యక్రమాలు, ఇతరాత్ర కారణాల వల్ల వయనాడ్ కు మంత్రి తక్షణం వెల్లలేకపోయినా ఎప్పటికప్పుడు అక్కడి ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూనే ఉన్నారు. వయానాడ్ ప్రజల సహాయార్ధం తన వంతుగా నిధులను సమీకరించడం మొదలు పెట్టారు. సీతక్క ప్రయత్నాలను తెలుసుకున్న పలువురు నాయకులు తమ వంతు సహకారం ఆందించారు. ములుగు డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి, టీపీపీసీ ప్రధాన కార్యదర్శి సత్తుమల్లేష్ తదితర నాయకులు ఆర్థికంగా సహకరించారు. ములుగు, ఆదిలాబాద్ పార్టీ శ్రేణులు ముందుకొచ్చి చేయూత నిచ్చారు. మంత్రి సీతక్క భద్రత, వ్యక్తిగత సిబ్బంది సైతం తమ వంతుగా రూ.50 వేల సహాయం చేశారు. వయనాడ్ ప్రజల కోసం ముందు కొచ్చి నిధులు, వస్తువులు అందజేసిన వారికి, బాలవికాస్ వంటి స్వచ్చంధ సంస్థలకు మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు.