అబుదాబీ నుంచి అక్రమంగా బంగారం తరలిస్తున్న ఇద్దరు ప్రయాణికులను రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డీఆర్ఐ) అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. సదరు ప్రయాణికులు ఇద్దరు అబుదాబీ నుంచి విమానంలో ముంబై విమానాశ్రయంలో దిగారు.
వారు వ్యాక్స్ ఫామ్లో 4.52 కిలోల బంగారం డస్ట్ రూపంలో తీసుకొచ్చారు. విమానాశ్రయం వద్ద నిర్వహించిన తనిఖీల్లో ఈ సంగతి తేలింది. కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా విదేశాల నుంచి బంగారం తీసుకొస్తున్నందుకు వారిని అదుపులోకి తీసుకున్నట్లు డీఆర్ఐ అధికారులు చెప్పారు. ఈ బంగారం విలువ రూ.3.33 కోట్లు ఉందని సమాచారం.
తమకు విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు కస్టమ్స్ గ్రీన్ చానెల్ దాటేసిన తర్వాత వారిని తనిఖీ చేశామని డీఆర్ఐ అధికారులు తెలిపారు. వారివద్ద వ్యాక్స్ ఫామ్లో ‘గోల్డ్ డస్ట్’ నాలుగు ప్యాకెట్లలో విదేశీ బంగారం దొరికింది. ప్యాసింజర్లు టైలర్ తయారు చేసిన జాకెట్ లో ప్యాకేట్లు కుట్టించారు. అబుదాబీలో ఒక ప్రయాణికుడు వీరికి ఈ బంగారం అందజేశాడని డీఆర్ఐ అధికారులు తెలిపారు. నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి, కస్టమ్స్ చట్టం కింద కేసు నమోదు చేశామని డీఆర్ఐ అధికారులు చెప్పారు.