రుణమాఫీ జరిగింది ఇలా!
జులై 15వ తేదీన రుణమాఫీ జీవో జారీ చేసింది ప్రభుత్వం. మూడు రోజుల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయటం మొదలు పెట్టింది. జులై 18వ తేదీన మొదటి విడుతగా లక్ష రూపాయల స్లాబ్ వరకు రుణమున్న రైతు కుటుంబాలన్నింటికీ ఏకకాలంలో మాఫీ చేసింది. 11,14,412 మంది రైతులకు రూ.6,034.97 కోట్లు విడుదల చేసింది. జులై 30వ తేదీన అసెంబ్లీ వేదికగా రెండో విడుత రుణమాఫీ కార్యక్రమం అమలు చేసింది ప్రభుత్వం. రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు రుణమున్న రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేసింది. దాదాపు 6,40,823 మంది రైతుల ఖాతాల్లో రూ.6,190.01 కోట్లు జమ చేసింది.
కేవలం 12 రోజుల్లోనే దాదాపు 17.55 లక్షల రైతుల కుటుంబాలకు రూ.12 వేల కోట్లకుపైగా రుణమాఫీ నిధులు జమ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఇవాళ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మూడో విడుత పంట రుణమాఫీకి సన్నద్ధమైంది. విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా ఇది జరగనుంది. ఖమ్మం జిల్లా వైరా మండలంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. చివరి విడుతలో రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు మాఫీ చేస్తారు. 14.45 లక్షల మందికి పైగా రైతులకు రూ.18.7 వేల కోట్లకు పైగా నిధులు జమ చేస్తారు. దీంతో రుణమాఫీలో కీలక ఘట్టం ముగుస్తుంది.