AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. చంద్రబాబు సర్కార్ కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ శుభవార్త వినిపించింది. తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను రిలీవ్ చేస్తూ.. ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ప్రభుత్వ ఉద్యోగులను.. తిరిగి వారి సొంత రాష్ట్రానికి పంపేలా ఉత్తర్వులు ఇచ్చింది. ఈ క్రమంలో.. మొత్తం 122 మంది తెలంగాణా స్థానికత కలిగిన నాన్ గెజిటెడ్ ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.

ప్రస్తుతం వేర్వేరు విభాగాల్లో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులను రిలీవ్ చేసే ముందు వారి నుంచి అంగీకారం తీసుకోవాలని చంద్రబాబు సర్కార్ స్పష్టం చేసింది. తెలంగాణకు రిలీవ్ అవుతున్న ఉద్యోగులు తమ కేడర్‌లోని చివరి ర్యాంక్‌లో మాత్రమే చేరుతారని ప్రభుత్వం స్పష్టం చేసింది.

అయితే.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు ఉద్యోగులు ఇప్పటికీ.. ఆంధ్రప్రదేశ్‌లోనే పని చేస్తున్నారని.. వారిని తమ రాష్ట్రానికి పంపాలని టీఎన్‌జీఓ సంఘం నేతలు గతంలో పలుమార్లు ఏపీ ప్రభుత్వానికి విన్నవించారు. తెలంగాణ నేటివ్‌ ఎంప్లాయిస్‌ వర్కింగ్‌ ఇన్‌ సీమాంధ్ర అసోసియేషన్‌ కూడా తమను ఏపీ నుంచి రిలీవ్‌ చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంది. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను ఏపీకి కేటాయించగా… వారిలో కొందరు తిరిగి తెలంగాణకు వెళ్లిపోయారు. కాగా.. మిగిలిన వారు మాత్రం అక్కడే పని చేస్తూ ఉండిపోయారు. రాష్ట్రం విడిపోయి పదేళ్లయినా తమను స్వరాష్ట్రానికి పంపకపోవడం పట్ల ఉద్యోగులు పలు సందర్భాల్లోనూ ఆవేదన వ్యక్తం చేశారు.

ANN TOP 10