AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

డ్యాం గేట్లన్నీ మూసివేత.. నాగార్జునసాగర్‌ నుంచి నీటి విడుదలను నిలిపేసిన అధికారులు

సాగర్‌లో ఏపీ అధికారుల దౌర్జన్యం

(అమ్మన్యూస్, నల్లగొండ):
నాగార్జునసాగర్‌ డ్యాం క్రస్ట్‌ గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదలను అధికారులు నిలుపుదల చేశారు. సోమవారం మధ్యాహ్నం వరకు 18 గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విదుదల చేశారు. అనంతరం అన్ని గేట్లను మూసివేశారు. మధ్యాహ్నం వరకు క్రస్ట్‌ గేట్ల ద్వారా 1.43 లక్షల క్యూసెక్కులు, ఎడమ కాలువకు 8,541 క్యూసెక్కులు, కుడికాలువకు 3937 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 29,273 క్యూసెక్కుల నీటిని వదిలారు. కాగా, నాగార్జునసాగర్‌ పూర్తి నీటిమట్టం 590 అడుగులకుగాను ప్రస్తుతం 588.80 అడుగుల వద్ద ఉంది. అదేవిధంగా గరిష్ట నీటినిల్వ 312.50 టీఎంసీలు కాగా, ఇప్పుడు 305.46 టీఎంసీలులు ఉన్నాయి.

వాక్‌వే బ్రిడ్జి గేట్‌ తాళం ధ్వంసం..
నాగార్జునసాగర్‌ డ్యామ్‌ పైనుంచి క్రస్ట్‌ గేట్ల సమీపానికి వెళ్లడానికి ఏర్పాటు చేసిన గేటు తాళాన్ని ఆంధ్రా అధికారులు ధ్వంసం చేశారు. క్రస్ట్‌ గేట్ల సమీపానికి వెళ్లడానికి అనువుగా కొన్నేళ్ల క్రితం వాక్‌వే బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. దానికి ఆంధ్రా, తెలంగాణ రెండు వైపులా గేట్లు ఏర్పాటు చేయగా నిర్వహణ పూర్తిగా తెలంగాణ అధికారులు చేపడుతున్నారు. ఆదివారం ఆంధ్రాకు సంబంధించిన సుమారు 20 మంది అధికారులు ఏపీ సీఎం పేషీ నుంచి వచ్చారు. వాక్‌వే బ్రిడ్జి గేట్‌కు తాళం వేసి ఉండటంతో తెలంగాణ ఎన్నెస్పీ అధికారులను తాళం చెవి అడిగారు. దాంతో వారు కొంత సమయం పడుతుందని చెప్పడంతో ఆంధ్రా అధికారులు దౌర్జన్యంతో గేట్‌ తాళం పగులగొట్టి వాక్‌వే బ్రిడ్జి మీదికి వెళ్లిపోయారు.

13వ గేట్‌ వరకు తమ ఆధీనంలో ఉన్నదంటూ తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నారని తెలంగాణ ఉద్యోగులు వాపోతున్నారు. డ్యామ్‌పై కంట్రోల్‌ రూమ్‌ 26వ గేట్‌ అవతల ఉన్నదని అక్కడికి వెళ్లి డ్యూటీ చేసే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫొటోలు, వీడియోలు ఉన్నతాధికారులకు పంపించినట్టు సమాచారం. ఈ ఘటనపై ఈఈ మల్లికార్జునరావును వివరణ కోరగా ఆంధ్రా అధికారులు తాళం పగులగొట్టిన విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. డ్యామ్‌పై పహారా కాస్తున్న సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది ఆంధ్రా నుంచి ఎవరు వచ్చినా అనుమతిస్తున్నది.

ANN TOP 10