చర్యలు తీసుకోవాలంటూ పిల్ దాఖలు
(అమ్మన్యూస్, హైదరాబాద్):
తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు హైకోర్టుకు చేరాయి. అఖిల భారత సర్వీసు ఉద్యోగాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్ల అంశంపై స్మితా సబర్వాల్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా చల్లారడం లేదు. ఈ అంశంపై ఇప్పటికే దివ్యాంగులతో పాటు పలువురు సీనియర్ రాజకీయ నాయకులు స్మితా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తాజాగా ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది. దివ్యాంగుల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని సామాజికవేత్త వసుంధర తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. యూపీఎస్సీ చైర్మన్ కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్పై విచారణ జరగ్గా పిటిషనర్ కు ఉన్న అర్హతను కోర్టు ప్రశ్నించింది. దీంతో పిటిషనర్ ఒక దివ్యాంగురాలు అని పిటిషనర్ తరపున లాయర్ కోర్టుకు తెలిపారు. దీంతో పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.