బీఆర్ఎస్పై దుష్ప్రచారం చేస్తున్న వారికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. విలీనం, పొత్తులపై ఫేక్ ప్రచారం చేస్తున్నారని.. అసత్యాలు ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు. 24 ఏళ్లుగా అనేక కుట్రలను బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొందని ఆయన గుర్తు చేశారు. అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా తెలంగాణను తీర్చిదిద్దామన్న కేటీఆర్.. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల కోసం నిలబడుతుందన్నారు. తప్పుడు ప్రచారాలను తెలంగాణ ప్రజలు నమ్మరని హితవు పలికారు.
బీఆర్ఎస్పై కక్ష పూరిత దుష్ప్రచారం చేస్తున్న సంస్థలు, వ్యక్తులు వెంటనే ప్రజలకి వివరణ ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేదంటే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణ సాధనలో చిత్తశుద్ధితో, 24 ఏళ్ళ పాటు నిబద్ధతతో, పట్టుదలతో అవిశ్రాంతంగా పోరాడామని స్వరాష్ట్రాన్న సాధించుకున్నామని తెలిపారు. సాధించుకున్న తెలంగాణ సగర్వంగా నిలబెట్టుకుని, అభివృద్ధిలో అగ్రపథాన నిలిపామని కేటీఆర్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తెలిపారు. దుష్ప్రాచారాలు మానుకోవాలని హితవు పలికిన కేటీఆర్.. పడతాం, లేస్తం, తెలంగాణ కోసమే పోరాడుతాం… కానీ తలవంచం.. ఎన్నటికైనా ఎప్పటికైనా అని కేటీఆర్ స్పష్టం చేశారు.