పతకం లేకుండానే..!
(అమ్మన్యూస్, పారిస్):
ఒలింపిక్స్లో భారత కల చెదిరింది. గోల్డ్ మెడల్ కోసం ఆశగా ఎదురుచూసిన యావత్ భారత ప్రజలకు నిరాశ కలిగింది. ఫైనల్ చేరిన రెజ్లర్ వినేశ్ ఫొగాట్పై అనర్హత వేటు పడింది. గురువారం జరిగే ఫైనల్లో వినేష్ పతకం సాధిస్తుందనే ధీమాతో ఉన్న భారత అభిమానులకు ఒలింపిక్ కమిటీ ఊహించని షాక్ ఇచ్చింది. 50 కేజీల విభాగంలో ఆమె పాల్గొనగా.. అంతకంటే కొన్ని గ్రాముల బరువు ఎక్కువగా ఉందని వినేష్పై అనర్హత వేటు వేసింది. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం ప్రకటన విడుదల చేసింది.
స్పందించిన భారత ఒలింపిక్ సంఘం
వాస్తవానికి మహిళల ఫ్రీస్టైల్ 50 కేజీల ఫైనల్ బుధారం రాత్రి జరగాల్సి ఉంది. ఇందులో భాగంగా ఆమె బరువును చూసిన నిర్వహకులు 100 గ్రాములు అదనంగా ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. దీనిపై భారత ఒలింపిక్ సంఘం సైతం స్పందించింది. ‘వినేష్ ఫొగాట్ 50 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఈవెంట్లో అనర్హత వేటును ఎదుర్కవాల్సి వచ్చింది. ఉండాల్సిన బరువు కన్నా కేవలం కొన్ని గ్రాముల బరువు పెరగడంతో వేటు పడింది. దయచేసి ఆమె (వినేష్ ఫొగాట్) ప్రైవసీకి భంగం కలగకుండా ఉండాలని అందర్నీ కోరుతున్నాం. ఈ తరహా వార్తను (అనర్హత వేటు) పంచుకునే పరిస్థితి రావడం అత్యంత బాధాకరం‘ అని భారత ఒలింపిక్ సంఘం ప్రకటన విడుదల చేసింది.
ఫైనల్ చేరిన తొలి మహిళా రెజ్లరగా..
కాగా తన కెరీర్లో మూడో ఒలింపిక్లో పాల్గొన్న వినేష్ ఫొగాట్.. ఈ ఈవెంట్లో ఫైనల్ చేరిన తొలి మహిళా రెజ్లరగా నిలిచింది. 2016 రియో ఒలింపిక్స్లో గాయం కారణంగా ఆమె పోటీ నుంచి నిష్క్రమించింది. ఇక 2020 టోక్యో ఒలింపిక్స్లో క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. తాజాగా పారిస్ ఒలింపిక్స్లో వరుస విజయాలతో ఫైనల్ చేరింది. రౌండ్–16లో డిఫెండింగ్ ఛాంపియన్ జపాన్కు చెందిన యుయిని 3–2తో వినేష్ ఫొగాట్ చిత్తు చేసింది. దీంతో క్వార్టర్స్కు చేరుకుంది. క్వార్టర్స్లోనూ ఉక్రెయిన్కు చెందిన ఒక్సానా లివాచ్ను 7–5తో ఓడించింది. సెమీఫైనల్ అయితే ఏకంగా 5–0 తేడాతో క్యూబాకు చెందిన రెజ్లర్ యుస్నీలిస్ గుజ్మాన్ను చిత్తు చేసింది.