AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

విద్యుత్ కొనుగోళ్లపై సభలో నిప్పులు చెరిగిన సీఎం రేవంత్.. ఐదో రోజూ వాడీవేడిగా చర్చ

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజూ వాడీవేడిగా కొనసాగాయి. శాసనసభలో విద్యుత్‌ రంగంపై చర్చలో భాగంగా గత బీఆర్‌ఎస్‌ సర్కార్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక విధంగా ఈ చర్చ అసెంబ్లీలో ‘హైటెన్షన్‌’ రేపింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ పై నిప్పులు కురిపించారు. పవర్‌ ప్లాంట్ల పేరిట రాష్ట్రంలో భారీ దోపిడీ జరిగిందని రేవంత్‌ రెడ్డి అన్నారు. యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ ఒప్పందం రూ.25 వేల కోట్లకే జరిగిందని.. కానీ ఇప్పుడు అది రూ.40 వేల కోట్లకు వ్యయం పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఎన్టీపీసీ నుంచి పవర్‌ తీసుకునే అవకాశం ఉందని.. పర్‌ మెగావాట్‌కు రెండున్నర కోట్ల అంచనాలు పెంచారని తెలిపారు. భద్రాద్రి, యాదాద్రి పవర్‌ ప్లాంట్లలో అవినీతిని తేల్చేందుకే విద్యుత్‌ శాఖపై కమిషన్‌ వేశామని చెప్పారు. అసలు ఎన్టీపీసీతో అగ్రిమెంట్‌ చేసుకున్నది తాము అని అన్నారు. అందుకే కమిషన్‌ను రద్దు చేయాలని కోర్టుకు వెళ్లారు. కోర్టులో మొట్టికాయలు పడగానే… గొంతులో వెలక్కాయపడ్డట్లయిందని తెలిపారు. 45 శాతం అంచనాలు పెంచి విద్యుత్‌ సంస్థల్ని నష్టాల్లో ముంచారని అన్నారు. ఇవాళ జగదీశ్‌ రెడ్డి, కేసీఆర్‌ సత్యహరిశ్చంద్రులు అనేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. లోకల్‌ సెంటిమెంట్‌ను రగిల్చేందుకే జగదీశ్‌ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. జగదీశ్‌ రెడ్డి మీద నల్లగొండ ప్రజలకు ఎంత విశ్వసనీయత ఉందో మొన్నటి పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలిసిపోయిందని ఎద్దేవా చేశారు.

సత్య హరిశ్చంద్రులు అయితే..
విద్యుత్‌ కొనుగోళ్లు, ఒప్పందాల విషయంలో తమ నాయకుడు కేసీఆర్‌ సత్య హరిశ్చంద్రుడు అన్నట్లుగా మాట్లాడిన బీఆర్‌ఎస్‌ సభ్యులు.. మరి జ్యుడీషియల్‌ కమిషన్‌ విచారణ రద్దు చేయాలని ఎందుకు కోర్టుకు వెళ్లారని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ధ్వజమెత్తారు. విద్యుత్‌ అంశంలో విచారణ జరిపిస్తామని వేము అనలేదని, అసెంబ్లీ వేదికగా మాజీ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి కోరడంతో ఛత్తీస్‌ గఢ్, యాదాద్రి పవర్‌ ప్లాంట్, భద్రాద్రి పవర్‌ ప్లాంట్ల నిర్మాణాలపై విచారణ కమిషన్‌ నియమించామని సీఎం తెలిపారు. కమిషన్‌ సమన్లు జారీ చేస్తే బాధ్యత గల పౌరుడిగా విచారణకు హాజరై కేసీఆర్‌ తన నిజాయితీ నిరూపించుకోవాల్సింది పోయి కమిషన్‌ పై ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. విద్యుత్‌ అంశంలో జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని సెగ తగలగానే కమిషన్‌ విచారణ వద్దంటూ కోర్టుకు వెళ్లారన్నారు. అయితే హైకోర్టులో వీరి వాదనను కొట్టివేస్తే సుప్రీంకోర్టుకు వెళ్లారని అక్కడ అభ్యంతరం ఉంటే కమిషన్‌ చైర్మన్‌ ను మార్చాలని సూచిస్తూనే విచారణ మాత్రం జరగాల్సిందే అని తేల్చి చెప్పిందన్నారు.

కొత్త కమిషన్‌ను నియమిస్తాం..
త్వరలో విద్యుత్‌ కమిషన్‌ కు కొత్త చైర్మన్‌ ను నియమిస్తామని సీఎం వెల్లడించారు. విద్యుత్‌ విషయంలో విచారణ చేస్తే బీఆర్‌ఎస్‌ నేతలు గుండెలు ఎందుకు బాధుకుంటున్నారని ప్రశ్నించారు.

సోనియా దయవల్లే తెలంగాణకు విద్యుత్‌..
తెలంగాణకు విద్యుత్‌ వెలుగులు తీసుకువచ్చింది. తామే తీసుకువచ్చినట్లుగా బీఆర్‌ఎస్‌ మాట్లాడుతున్నదని, కానీ విభజన చట్టంలో వినియోగం ప్రాతిపదికన విద్యుత్‌ పంపకాలు చేసిందే యూపీయే ప్రభుత్వం అన్నారు. విభజన చట్టం ప్రకారం విద్యుత్‌ పంపకాలలో తెలంగాణకు 36 శాతం, ఏపీకి 64 శాతం వచ్చేలా ఉంటే జైపాల్‌ రెడ్డి తీవ్రంగా కృషి చేసి మన్మోహన్‌ సింగ్, సోనియా గాంధీని ఒప్పించి తెలంగాణకు 53.46 శాతం ఇప్పించి ఆనాడు తెలంగాణను చీకట్ల నుంచి కాపాడారన్నారు. ఇక్కడ కూర్చున్నవారు, పొంకనాలు కొడుతున్న వారు ఏం చేయలేదన్నారు.

నాడు కేసు వేస్తామంటే..
తెలంగాణకు అదనంగా ఇచ్చిన విద్యుత్‌ అంశంపై∙కేసు వేస్తామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భావిస్తే నేను ఎర్రబెల్లి దయాకర్‌ రావు కలిసి చంద్రబాబును ఆపామన్నారు. మీరు కేసు వేస్తే ఇక్కడ టీడీపీకి తీవ్రంగా నష్టం జరుగుతుందని, కేసు వేయడానికి వీలు లేదని కొట్లాడి ఆపింది మేము అన్నారు. గురువులకు పంగనామాలు పెట్టే లక్షణం మీది అని దుయ్యబట్టారు. గతంలో ఇదే సభలో ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ఉంటే ప్రతిపక్షంలో నేను ఉన్నా. ఆనాడు సమాధానం చెప్పలేక తెలంగాణకు చీకటి రోజులు అని మార్షల్స్‌ ను పెట్టి నన్ను బయటకు ఈడ్చి బయటపడేశారన్నారు. నాడు, నేను నిజాయితీగా మాట్లాడుతున్నానన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన విద్యుత్‌ ప్రాజెక్టులు తెలంగాణ వచ్చాక ఉత్పత్తిలోకి రావడంతో రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభం నుంచి బయటపడిందన్నారు. 24 గంటల విద్యుత్‌ ఇవ్వాలని చంద్రబాబు హయాంలోనే నిర్ణయం జరిగితే విద్యుత్‌ కోతలు ఉండకూడదని రాజశేఖర్‌ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. కానీ సిగ్గులేకుండా ఇంకా విద్యుత్‌ ను మేమే ఉత్పత్తి చేశామని బీఆర్‌ఎస్‌ సభను తప్పుదోవ పట్టిస్తున్నది మండిపడ్డారు.

ఎక్కడ మెక్కిర్రో అంతా తెలుసు:
బీహెచ్‌ఎల్‌ పనులు ఇవ్వడంలో మీరు ఎక్కడ గండి కొట్టారు? ఎక్కడ బొక్కారు? ఎక్కడ మెక్కిండ్రో మాకు తెలియదా? మేమేం చదువుకోకుండానే ఇక్కడికి వచ్చామా? అని సీఎం అన్నారు. బీహెచ్‌ఎల్‌ కు ఎలక్ట్రో మెకానికల్‌ ఎక్విప్‌ మెంట్‌ ఉత్పత్తి చేసే సామర్థ్యం మాత్రమే ఉంది. సివిల్‌ బ్యాలెన్స్‌ ఆఫ్‌ వర్క్‌ సామర్థ్యం లేదు. కానీ తెలివితేటలు కలిగిన వీరు బీహెచ్‌ఎల్‌ నుంచి సివిల్‌ కాంట్రాక్టులన్ని వీళ్ల బినామీలు, బంధువులకు కాంట్రాక్టులు ఇచ్చారు. వీరి దోపిడి బయటకు వస్తుందనే ఊకదంపుడు ప్రసంగాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కమిషన్లకు కక్కుర్తి పడి, ఇండియా బుల్‌ సంస్థ నుంచి వెయ్యి కోట్లు మెక్కి కాలం చెల్లిన సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీని బీహెచ్‌ఎల్‌ నుంచి కొనుగోలు చేసి బకరా అయ్యారన్నారు. వీళ్లు చేసిన పనికి అధికారులు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

ANN TOP 10