– లేదంటే 50 వేల మంది రైతులతో వచ్చి పంప్హౌస్లు ఆన్ చేస్తాం
– రాజకీయ కక్షతో రైతులను ఇబ్బందులు పెట్టొద్దు
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
(అమ్మన్యూస్, హైదరాబాద్)
కాళేశ్వరం పరిధిలోని జలాశయాలను వచ్చే నెల 2వ తేదీ లోపు నీటితో నింపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే 50 వేల మంది రైతులతో వచ్చి తామే పంప్హౌస్లు ఆన్ చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ బీడు భూములను నీళ్లు అందిస్తామని స్పష్టం చేశారు. రాజకీయాల కోసం ప్రజలు, రైతులను ఇబ్బందులు పెట్టొద్దన్నారు. కేవలం రాజకీయ కక్షతో, కేసీఆర్ను బద్నాం చేయాలనే పంపులను ఆన్ చేయడం లేదని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లోపు కాళేశ్వరం పంప్హౌస్లు ఆన్ చేయాలన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్ను కేటీఆర్ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ కల్పతరువన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులం ప్రాజెక్టును పరిశీలించామని చెప్పారు.
దేశ చరిత్రలోనే..
దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయనంత వేగంగా కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించారని అన్నారు. ‘తెలంగాణలో కరువు అనే మాట వినపడొద్దని ఈ ప్రాజెక్టును నిర్మించారు. బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడూ నీటి సమస్య లేదు. గతంలో నీటి సమస్య ఉండేదని రాష్ట్ర ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తున్నది. ఈ ప్రభుత్వం పంటల సాగు కోసం నీరు ఇచ్చే పరిస్థితి లేదు. శ్రీరాంసాగర్లో నీళ్లు లేవు, ఎల్ఎండీలో 5 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. మిడ్ మానేరులోనూ 5 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. శ్రీరాంసాగర్ సామర్థం 90 టీఎంసీలు అయితే ఇప్పుడు 25 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని’ అన్నారు.
నగరానికి సైతం మంచినీళ్లు..
కాళేశ్వరం ప్రాజెక్టుతో కరువు ప్రాంతాలకు సాగునీరు అందుతుందన్నారు.‘ హైదరాబాద్కు కూడా మంచినీళ్లు అందించొచ్చు. 15 టీఎంసీలతో కొండ పోచమ్మ సాగర్ కట్టుకున్నం. 50 టీఎంసీలతో మల్లన్న సాగర్ కట్టుకున్నం. లక్ష్మీ పంప్హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో మూడు రోజులకు ఒకసారి తాగునీరు అందిస్తున్నారు. పది లక్షల క్యూసెక్కుల నీరు వృధాగా కిందకు పోతున్నాయి. కాళేశ్వంరం దగ్గర గోదవారి ఉధృతంగా ప్రవహిస్తున్నది. రిజర్వాయర్లు మాత్రం గొంతెండి ఎడారిలాగా మారాయని’ కేటీఆర్ మండిపడ్డారు.
ఇది కేసీఆర్ ఘనతే..
ఇంత గొప్ప సిస్టమ్ రూపొందించడం మరొకరి వల్ల కాదన్నారు. 17 పంపులు రెడీగా ఉన్నాయని, రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోయొచ్చన్నారు. రాజకీయ పరమైన నిర్ణయం వల్లే నీటిని ఎత్తిపోయడంలేదన్నారు. ప్రభుత్వం తలచుకుంటే 18 లక్షల ఎకరాలకు నీళ్లివ్వొచ్చని, తెలిపారు. నీళ్లు సముద్రంలోకి వృధాగా పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. బస్వాపూర్, కొండపోచమ్మ, రంగనాయకసాగర్, మల్లన్న సాగర్ రైతులు నీటికోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట వరకు రైతులు కాళేశ్వర జలాల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. కాళేశ్వరంలో పరిధిలో రిజర్వాయర్లలో నీటిని నింపడానికి ప్రభుత్వానికి ఆగస్టు 2 వరకు గడువిస్తున్నామని, సర్కార్ స్పందించకపోతే 50 వేల రైతులతో తామే పంపులు ఆన్ చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.