నాలుగు కోట్ల ప్రజల హక్కులు పట్టవా?
ఇద్దరి మధ్య మాటల యుద్ధం
దద్దరిల్లిన అసెంబ్లీ
(అమ్మన్యూస్, హైదరాబాద్):
తెలంగాణలో శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య మాటల యుద్ధం సాగింది. కేంద్రబడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరగడంపై జరిగిన చర్చలో భాగంగా రేవంత్, కేటీఆర్ ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సభలో ఉండి సహచర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో మాట్లాడించడంపై కేటీఆర్ విమర్శించగా.. రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని.. ప్రభుత్వం చాలా స్పష్టతతో ఉందని.. బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై చర్చకు అనుమతించాలని కోరామని.. సభకు ఆలస్యంగా వచ్చిన సభ్యుడు అసలు విషయం తెలుసుకోకపోతే ఎలా అన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల హక్కుల గురించి సభలో చర్చ జరుగుతున్నప్పుడు 25 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది.. పదేళ్లు సీఎం అని చెప్పుకునే ప్రతిపక్ష నేత ఎక్కడ దాక్కున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సభలో కనిపిస్తే ప్రధాని మోదీ ఏమనుకుంటారో అన్న∙భయంతో కేసీఆర్ ఎక్కడో దాక్కున్నారనిæ రేవంత్ ఎద్దెవా చేశారు. ప్రతిపక్ష సభ్యులు వివాదాల జోలికి వెళ్లకుండా సబ్జెక్ట్పై మాట్లాడాలని సూచించారు.
చీకటి ఒప్పందాలపై..
సభలో ముఖ్యమైన అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు సభను కేటీఆర్ తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. గాలివాటం మాటలను సభలో మాట్లాడుతున్నారని.. ఇప్పటికైనా ప్రతిపక్షం తమ పద్ధతిని మార్చుకోవాలని సూచించారు. ఢిల్లీ వెళ్లి చీకటి ఒప్పందాలు చేసుకున్నారని.. సభలో ఆ చీకటి ఒప్పందాల గురించి చెప్తారా.. లేదా బడ్జెట్పై ఇంకేమైనా వాళ్ల అభిప్రాయం చెబుతారో తెలుసుకోవడానికి చర్చను ప్రారంభించామన్నారు. ఇప్పటిరవకు కేటీఆర్ పేమెంట్కోటా అనుకున్నానని.. కానీ ఇప్పుడే ఆయన ఆబ్సెంట్ ల్యాండ్ లార్డ్ అని తేలిందన్నారు. మా నాన్న మాకు చదువు లేకపోయినా మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. తాము స్వయం కృషితో రాజకీయాల్లో ఎదిగామన్నారు. జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీగా పనిచేశానని.. తాను తండ్రిని అడ్డుపెట్టుకుని మంత్రి అవ్వలేదన్నారు. అవతలి వారిని కించపర్చాలనే ఉద్దేశంతో అహంకారపూరితంగా మాట్లాడటం సరికాదన్నారు.
రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిన ఘనత కేసీఆర్ది..
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేంద్రంలోని మోదీ తీసుకున్న అన్ని నిర్ణయాలకు మద్దతు తెలిపారని రేవంత్ అన్నారు. జీఎస్టీ, రైతు చట్టాలపై కేంద్రంలో బీజేపీకి కేసీఆర్ మద్దతు తెలపడం దారుణమన్నారు. తెలంగాణను అప్పులలోకి నెట్టిన ఘనత కేసీఆర్కు దక్కుతుందన్నారు. మోదీతో పదేళ్లపాటు స్నేహం చేసిన కేసీఆర్.. ఇప్పుడు కాంగ్రెస్ను దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ తెలంగాణ హక్కుల కోసం మాట్లాడితే ప్రజలు విశ్వసిస్తారని.. లేదంటే ప్రజలు బీఆర్ఎస్ నాయకులను క్షమించబోరన్నారు. ఎన్నో రకాల జబ్బులు ఉన్న వ్యక్తి.. ‘నేను ఎంతో ఆరోగ్యంగా ఉన్నా.. తన పెళ్లికి పిల్ల కావాలని’ అడిగినట్లు బీఆర్ఎస్ తీరు ఉందన్నారు. వంద ఎలుకలు తిన్న పిల్లి పాపాలు పోగొట్టుకోవడానికి తీర్థయాత్రలు చేసినట్లు బీఆర్ఎస్ పరిస్థితి ఉందన్నారు.