ఆర్టీసీని దోచుకున్నది మీ మామే..
యూనియన్లు రద్దు చేసింది మీరే..
మాట్లాడే హక్కు మీకు లేదంటూ పొన్నం ఆగ్రహం
(అమ్మన్యూస్, హైదరాబాద్):
అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం ఆర్టీసీ బకాయిల చర్చ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్రావుకు, మంత్రి పొన్నం మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ క్రమంలో హరీశ్రావు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సంక్షేమంపై కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చిందని, కాని అవేవి నేటికి అమలు కాలేదన్నారు. ఆర్టీసీ కార్మికులను ఎప్పటిలోగా, ఏ రోజు నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారుని హరీశ్ ప్రశ్నించారు. పరిశీలనలో ఉంది.. చూస్తాం.. చేస్తామని కాలయాపన కాదని.. ఖచ్చితమైన తేదీని ప్రకటించాలని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రభుత్వాన్ని కోరారు. ఆర్టీసీ యూనియన్ పునరుద్ధరణ చేస్తామని హామీ ఇచ్చారని, ఎప్పటిలోగా పునరుద్ధరిస్తారో చెప్పాలన్నారు. చనిపోయిన కార్మికుల పిల్లలకు వెంటనే ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆ చెక్కులేవీ చేరలేదు..
రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక రూ. 300 కోట్ల బకాయిలు ఇస్తున్నట్లు చెక్కులు చూపించారని, ఇప్పటి వరకు ఆ చెక్కు బస్ భవన్కు చేరలేదని హరీష్ రావు అన్నారు. మహాలక్ష్మి పథకం నిధులు నెల నెలా ఆర్టీసీకి ఇస్తున్నారా? ఎప్పటిలోగా ఇస్తారని ప్రశ్నించారు., రెండు పీఆర్సీలు వెంటనే చెల్లిస్తాం అన్నారు.. ఇంత వరకు చెల్లించలేదన్నారు.
హరీశ్కు పాస్ మార్కులు..!
కాగా హరీష్ రావు మాట్లాడుతుంటే.. మంత్రి శ్రీధర్ బాబు జోక్యం చేసుకుని ఆయన ప్రశ్నోత్తరాలలో స్పీచ్ మొదలు పెట్టారని అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టో భట్టి పట్టినందుకు ధన్యవాదాలు అన్నారు. హరీష్ రావుకు పాస్ మార్కులు వేస్తున్ననని శ్రీధర్ బాబు సెటైర్ వేశారు. ‘మా మేనిఫెస్టో భట్టి పట్టినందుకు మీకు తాను సూటిగానే ప్రశ్నలు అడుగుతున్నానని’ హరీశ్ రావు అన్నారు.
యూనియన్లు రద్దు చేసింది ఎవరు?: పొన్నం
హరీశ్రావు వ్యాఖ్యాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ వాళ్లు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని, యూనియన్లు రద్దు చేసింది ఎవరని ప్రశ్నించారు. రూ. 4 వేల కోట్ల బకాయిలు మాకు ఇచ్చి వెళ్లారని, ఆర్టీసీ ఉద్యోగులకు పని భారం పెరిగినా డబుల్ పేమెంట్ ఇస్తున్నామన్నారు. ఆర్టీసీని నష్టాల నుంచి లాభాల బాట పట్టిస్తున్నామని, గతంలో రిటైర్డ్ ఈడీని ఎండీగా పెట్టి సంస్థను నడిపించిన చరిత్ర బీఆర్ఎస్దని ఎద్దేవా చేశారు. ఆర్టీసీ ఆస్తులను మీ నాయకులకు అప్పనంగా అప్పగించారని ఆరోపించారు. గత ఆర్థిక శాఖ మంత్రిగా ఆర్టీసీ మీద మాట్లాడే నైతిక హక్కు హరీశ్ రావుకు లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.