పార్టీ శ్రేణులతో కలిసి దీక్ష
(అమ్మన్యూస్, న్యూఢిల్లీ):
ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని, తక్షణం రాష్ట్రపతి పాలన విధించాలని వైఎస్సార్సీపీ అధినేత జగన్ డిమాండ్ చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వంపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో దాడులకు నిరసనగా ఢిల్లీలో పార్టీ శ్రేణులతో కలిసి బుధవారం దీక్షకు దిగారు. అధికార మార్పిడి జరిగిన తరువాత చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని మండిపడ్డారు. దాడులు, దౌర్జన్యాలతో పాలన సాగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పారు. బాధితులపైనే కేసులు పెడుతున్నారని చెప్పుకొచ్చారు. ఏపీలో శాంతిభద్రతలు లేవని మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆరోపించారు.
ఇప్పటికే 30మందిని చంపేశారు..
రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదని విమర్శించారు. లోకేశ్ రెడ్ బుక్ పెట్టుకొని తనకు నచ్చని వారి పైన కక్ష సాధిస్తున్నారని జగన్∙ ఆరోపించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ హోర్డింగ్ లు ఏర్పాటు చేసారన్నారు. రెండ్ బుక్ లో పేర్లు ఉన్నాయంటూ రాజకీయ నేతలు, అధికారులను వేధిస్తున్నారన్నారు. బాధితుల పైనే పోలీసులు కేసులు పెడుతున్నారని చెప్పుకొచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత 30 మందికి పైగా వైసీపీ కార్యకర్తలను హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. వందల ఇళ్లను ధ్వంసం చేసారని..గిట్టని వారి పంటలు ధ్వంసం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. మేము అధికారంలో ఉన్న సమయంలో ఈ విధంగా దాడులను ప్రోత్సహించలేదని జగన్ వివరించారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అనే సందేహం కలగుతోందన్నారు. ఏపీలో పరిస్థితులు వివరించేందుకు రాష్ట్రపతి, ప్రధాని అప్పాయింట్ మెంట్ కోరామన్నారు. తమ దీక్ష ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వీడియో, ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా ఏపీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్దం అవుతుందని చెప్పుకొచ్చారు.