ఏఐసీసీ పెద్దలనూ కలవనున్న రేవంత్
(అమ్మన్యూస్, న్యూఢిల్లీ):
హస్తినలో సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీగా ఉన్నారు. ఢిల్లీ పర్యటన రెండో రోజు ఏఐసీసీ పెద్దలను సీఎం కలవనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీకి సంబంధించి వరంగల్లో భారీ సభకు కాంగ్రెస్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో వరంగల్ సభకు ఏఐసీసీ అగ్రనేతలను ఆహ్వానించాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయించింది. దీంతో ఆదివారం సీఎం ఢిల్లీకి వెళ్లారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు శనివారమే ఢిల్లీకి బయలుదేరి వెళ్లిపోయారు.
వీరంతా కలిసి సోమవారం కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీని కలిశారు. ఢిల్లీలోని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. వీరితో టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ కూడా పాల్గొన్నారు. అదేవిధంగా అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి కలవనున్నారు. అయితే సోమవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయిన నేపథ్యంలో ఏఐసీసీ అగ్రనేతలు పార్లమెంట్ ఇసీఎం పార్లమెంట్ వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే వారిని సీఎం పార్లమెంట్ ప్రాంగణంలో కలవనున్నట్లు సమాచారం. మరోవైపు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధి ప్రాజెక్టులపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. దీంతో సీఎం పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.