భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ విజయవంతంగా నిర్వహించిన చంద్రయాన్-3 ప్రాజెక్టుకు అరుదైన గౌవరం దక్కింది. అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ చంద్రయాన్-3కి ఇంటర్నేషనల్ స్పేస్ అవార్డును ప్రకటించింది. ఈ సందర్భంగా ఈ ప్రాజెక్టు చారిత్రాత్మక విజయమని పేర్కొంది. అక్టోబర్ 14న ఇటలీలోని మిలాన్లో జరుగనున్న 75వ అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ కాన్ఫరెన్స్ సందర్భంగా అవార్డును అందజేయనున్నది. ఇస్రో చంద్రయాన్-3 ల్యాడర్ ఆగస్టు 23, 2023న రోజున చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ చేసిన విషయం తెలిసిందే. దాంతో అమెరికా, రష్యా, చైనాలతో భారత్ చంద్రుడిపై అడుగుపెట్టాయని అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ సమాఖ్య పేర్కొంది.
ఇస్రో మిషన్ చంద్రయాన్-3 శాస్త్రీయ ప్రయోగాలు, తక్కువ ఖర్చుతో కూడిన ఇంజినీరింగ్కు ప్రత్యేక ఉదాహరణ అని.. ఇది అంతరిక్ష పరిశోధనలో భారత్కు ఉన్న భారీ సామర్థ్యానికి చిహ్నమని పేర్కొంది. చంద్రుడి నిర్మాణం, భూగర్భ శాస్త్రంలో కనిపించని అంశాలను చంద్రయాన్-3 వెలుగులోకి తీసుకువచ్చిందని పేర్కొంది. ఈ మిషన్ కొత్త ప్రయోగాలకు గ్లోబల్ అచీవ్మెంట్ అని, చంద్రయాన్-3 ఎన్నో విజయాలు సాధించిందంటూ ప్రశంసించింది. గతేడాది ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ను భారత్ విజయవంతంగా ఇస్రో ల్యాండింగ్ చేసింది. అమెరికా, చైనా, రష్యా తర్వాత చంద్రుడిపై కాలుపెట్టిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది. ఇప్పటి వరకూ ఏ దేశం వెళ్లని చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన మొదటి దేశంగా చరిత్ర సృష్టించింది.
రెండు వారాల పాటు పరిశోధనలు సాగించేలా వీలుగా విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లను ఇస్రో రూపొందించింది. విక్రమ్ ల్యాండ్ అయిన తర్వాత లోపలి నుంచి బయటకు వచ్చిన ప్రజ్ఞాన్ రోవర్.. 100 మీటర్లు దూరం ప్రయాణించి అక్కడ సమాచారాన్ని సేకరించింది. ఆ తర్వాత ల్యాండర్, రోవర్లు స్లీప్ మోడ్లోకి వెళ్లాయి. రెండు వారాల తర్వాత మేల్కొలిపే ప్రయత్నం చేసినా ఇస్రో శాస్త్రవేత్తల ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో అవి శాశ్వత నిద్రలోకి వెళ్లినట్టు శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. చంద్రయాన్-3 విజయవంతంతో జోరుమీదున్న భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో.. చంద్రయాన్-4 ప్రయోగం చేపట్టబోతున్నది. ఈ మిషన్లో చంద్రుడిపై నమూనాలను సేకరించి మళ్లీ తిరిగి భూమిపైకి చేరుకోనున్నది. మిషన్ను 2026 నాటికి నిర్వహించాలని ఇస్రో భావిస్తున్నది.