– గండిపడిన పెదవాగు ప్రాజెక్టును సందర్శించిన మంత్రి
(అమ్మన్యూస్, అశ్వారావుపేట):
భారీ వర్షాలతో గండిపడి చిన్నా భిన్నమైన పెదవాగు ప్రాజెక్టును రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు గండిపడిన ప్రదేశాలను మంత్రి పరిశీలించి అధికారులతో మాట్లాడారు. రక్షణ చర్యలు గురించి, ప్రాజెక్టు పునర్నిర్మాణ పనులపై చర్చించారు. ఈ క్రమంలో రైతులతో తుమ్మల మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ ప్రాంత వ్యవసాయంపై పరిపూర్ణమైన అవగాహన ఉన్న మీకు మాత్రమే తమ బాధలు తెలుసునని తమకు న్యాయం చేయాలని తుమ్మల ఎదుట బాధిత రైతులు వాపోయారు.
కలెక్టర్, ఎస్పీకి అభినందనలు..
ఈ విషయమై మంత్రి తుమ్మల మాట్లాడుతూ ప్రాజెక్టుకు గండిపడి భారీ స్థాయిలో నష్టం జరగటం దురదృష్టకరమైన సంఘటన అని అన్నారు. వరద సమయంలో కలెక్టర్, ఎస్పీ, స్థానిక ఎమ్మెల్యే, పోలవరం ఎమ్మెల్యేలు అహర్నిశలు శ్రమించి ఎటువంటి ప్రాణనష్టం కలగకుండా చూశారని వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తుమ్మల తెలిపారు. ప్రాజెక్టు పునర్నిర్మాణానికి ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సంబంధిత ఇరిగేషన్ అధికారులను మంత్రి ఆదేశించారు. అలాగే రైతులెవరూ అధైర్య పడవద్దని పంట, ఆస్తి నష్టం జరిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. ఇప్పటికే వ్యవసాయ అధికారులు పంట నష్టంపై సర్వేను ప్రారంభించారన్నారు.
నూరు శాతం న్యాయం చేస్తా..
వరదల వల్ల కలిగిన నష్టంపై కలెక్టర్ తుది నివేదిక వచ్చిన తర్వాత బాధితులకు తప్పనిసరిగా నూటికి నూరు శాతం న్యాయం చేస్తామని మంత్రి బాధితులకు హామీ ఇచ్చారు. ఈ విషయంలో ఎటువంటి సందేహాలు వద్దని తప్పనిసరిగా ప్రతి ఒక్క రైతుకు నూటికి నూరు శాతం పరిహారం అందేల తాను కృషి చేస్తానని అన్నారు.