AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఓపెన్‌కాస్ట్‌ గనుల్లోకి చేరిన నీరు.. సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. దీంతో కోల్‌బెల్ట్‌లోని జిల్లాల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భద్రాద్రి జిల్లాలోని ఇల్లందు, కోయగూడెం ఓపెన్‌కాస్ట్‌ గనుల్లోకి వర్షపు నీరు చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 10 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 35 వేల క్యూబిక్‌ మీటర్ల మట్టి వెలికితీత పనులు ఆగిపోయాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామికవాడలో గత నాలుగు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాలుగు ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. రోజుకు 80 వేల టన్నుల మేర బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో ఓపెన్‌కాస్ట్‌ గనుల్లో చేరిన నీటిని అధికారులు బటయకు పంపిస్తున్నారు.

ఇక భారీ వర్షాలతో నిర్మల్‌ జిల్లాలోని కడెం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరుగుతున్నది. ప్రాజెక్టులోకి 19,686 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 18,227 క్యూసెక్కుల వరద బయటకు వెళ్తున్నది. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్‌లోకి 385 క్యూసెక్కుల వరద వస్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా.. ప్రస్తుతం 1387 అడుగులుగా ఉన్నది.

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి 4.06 లక్షల క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు 85 గేట్లు ఎత్తి వరదను వదులుతున్నారు. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద జలకళ సంతరించుకున్నది. ఇక్కడ గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో 10 మీటర్ల ఎత్తులో వరద ప్రవహం ఉన్నది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 38 అడుగుల వద్ద కొనసాగుతున్నద. సాయంత్రం వరకు ఇది 40 అడుగులకు చేరే అవకాశం ఉన్నది. దీంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులను జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు.

ANN TOP 10