తెలంగాణతోపాటు (Telangana) ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వరద పోటెత్తడంతో గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు క్రమంగా వరద ప్రవాహం పెరుగుతున్నది. ప్రాజెక్టుకు 90,800 క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు 17 గేట్లు ఎత్తి 66,810 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 33,084 క్యూసెక్కులు వదలుతున్నారు. జూరాల ప్రాజెక్టు మొత్తం నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 317.50 మీటర్ల వద్ద నీరు ఉన్నది. జలాశయం నీటి నిల్వ 9.657 టీఎంసీలు. ఇప్పుడు 7.645 టీఎంసీలు ఉన్నాయి.
కాగా, జూరాల నుంచి పెద్ద ఎత్తున నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో శ్రీశైలానికి 1,04,416 క్యూసెక్కులు వస్తున్నది. అధికారులు 99,894 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో నాగార్జున సాగర్కు వరద పోటెత్తింది. సాగర్లో ప్రస్తుతం 504.50 అడుగుల వద్ద నీరు నిల్వ ఉన్నది. ప్రాజెక్టు నుంచి 9,874 క్యూసెక్కులు దిగువకు వెళ్తున్నది.
గోదావరి పరీవాహక ప్రాంతంలో వర్షాలు కురుస్తుండటంతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద వచ్చి చేరుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 14,063 క్యూసెక్కుల వరద వస్తున్నది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులుకాగా, ప్రస్తుతం 1067.10 అడుగుల వద్ద ఉన్నది. ప్రాజెక్టుకు గరిష్ట నీటినిల్వ 80.5 టీఎంసీలు. ఇప్పుడు 18.833 టీఎంసీలు ఉన్నాయి. ఇక నిర్మల్ జిల్లాలోని స్వర్ణ జలాశయానికి 6480 క్యూసెక్కుల వరద వస్తున్నది. ప్రాజెక్టులో ప్రస్తుతం 1176 అడుగుల నీటమట్టం ఉన్నది.