స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. రాజయ్య కారు ఢీకొని ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. వరంగల్ జిల్లా కాజీపేట మండలం మడికొండ వద్ద కలకోట్ల స్వప్న అనే మహిళ రోడ్డు దాటుతుండగా.. వేగంగా వచ్చిన రాజయ్య కారు ఆమెను ఢీకొట్టింది. కారు బలంగా ఢీకొట్టడంతో స్వప్నకు తీవ్రగాయాలు కాగా.. అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదం జరిగిన వెంటనే కారు ఆపి కింది దిగిన తాటికొండ రాజయ్య.. రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి.
అనంతరం తన కారును కాజీపేటలోని బాపూజీనగర్లో వదిలేసి తాటికొండ రాజయ్య వెళ్లిపోయారని తెలుస్తోంది. అయితే.. ప్రమాద సమయంలో కారు నడిపింది తాటికొండ రాజయ్యనా లేదా.. ఆయన డ్రైవరా అన్నది స్పష్టత రాలేదు. కాగా.. ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు.. ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇప్పటికే తాటికొండ రాజయ్య పలు వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకపోవటంతో.. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి సైలెంట్గా ఉన్న రాజయ్య.. పార్లమెంట్ సమయంలో కడియం శ్రీహరి తన కూతురితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరటంతో.. మళ్లీ గులాబీ బాస్ కేసీఆర్ను కలిసి బీఆర్ఎస్లో చేరారు.