స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై ప్రణాళికను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బీసీ రిజర్వేషన్ల పెంపుతోపాటు స్థానిక సంస్థలకు కేంద్రం ప్రభుత్వం నుంచి నిధులు ఆగిపోకుండా, త్వరగా ఎన్నికలు నిర్వహించేలా కార్యాచరణను రూపొందించాలని సీఎం స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఇప్పటివరకు అనుసరించిన విధానాలపై పట్టిక రూపొందించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. సందేహాలు ఉంటే మాజీ మంత్రి జానారెడ్డితోపాటు పంచాయతీరాజ్ శాఖ నిపుణులు, మాజీ ఉన్నతాధికారుల సలహాలు తీసుకోవాలని, చట్టపరమైన అంశాలపై అడ్వకేట్ జనరల్ తో మాట్లాడాలని సీఎం సూచించారు.
వీలైనంత తొందరగా నివేదిక ఇవ్వండి
ఇతర రాష్ట్రాల్లో రిజర్వేషన్ల విధానంపై పూర్తిగా అధ్యయనం చేయాలన్నారు. ఆయా అంశాలపై త్వరగా నివేదిక తయారు చేస్తే అసెంబ్లీ సమావేశాలకు ముందే మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి అధికారులతో చెప్పారు. పంచాయతీల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. గత పంచాయతీ ఎన్నికల్లో అనుసరించిన విధానం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధతపై అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. కులగణన చేయడానికి ఎంత సమయం పడుతుందనేదానిపై సీఎం ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వం 2011లో 53 కాలమ్స్ తో కుల గణన చేసిందని, దానికి మరో మూడు జోడిస్తే కనీసం అయిదున్నర నెలల సమయం పడుతుందని అధికారులు వివరించారు.
అదేవిధంగా కర్ణాటకలో 2015లో, బీహార్ రాష్ట్రంలో 2023లో కుల గణన చేశారని, ఏపీలో కూడా చేసినప్పటికీ ఆ వివరాలు బయటపెట్టలేదని అధికారులు చెప్పారు. రిజర్వేషన్ల పెంపు సాధ్యాసాధ్యాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, సీఎం సలహాదారు నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మాజీ మంత్రి జానారెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్ తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణలో ఇప్పటివరకు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అనుసరించిన విధానాలు, బీసీ రిజర్వేషన్లపై కోర్టు వివాదాల గురించి జానారెడ్డి వివరించారు. ఈ సమావేశంలో సీఎం శాంతికుమారితోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.