తెలంగాణలో రైతురుణమాఫీపై రేవంత్ సర్కార్ మార్గదర్శలు విడుదల చేసింది. తెలంగాణలో భూమి ఉన్న ప్రతీ రైతుకు రూ.2లక్షల రుణమాఫీ చేయనుంది. కాగా ఆగస్టు 15లోపు రైతులకు రుణమాఫీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
రుణమాఫీపై గైడ్ లైన్స్..
* తెలంగాణలో భూమి కలిగివున్న ప్రతి రైతు కుటుంబానికి రూ.2 లక్షల వరకు పంట రుణ మాఫీ వర్తిస్తుంది.
* ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుంది.
* తెలంగాణ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు (ఉమ్మడిగా “బ్యాంకులు” అని పిలువబడుతాయి) వాటి బ్రాంచ్ ల నుండి రైతులు తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది.
* 12-12-2018 తేదీన లేదా ఆ తర్వాత మంజూరయిన లేక రెన్యువల్ అయిన రుణాలకు మరియు 09-12-2023 తేదీ నాటికి బకాయి ఉన్న పంటరుణాలకు ఈ పథకం వర్తిస్తుంది.
* ఈ పథకం కింద ప్రతి రైతుకుటుంబం, 2 లక్షల రూపాయల వరకు పంట రుణమాఫీకి అర్హులు. 09-12-2023 తేదీ నాటికి బకాయి వున్న అసలు, వర్తింపయ్యే వడ్డీ మొత్తం. పథకానికి అర్హత కలిగి వుంటుంది.
* రైతు కుటుంబం నిర్ణయించడానికి పౌరసరఫరాల శాఖ వారు నిర్వహించే ఆహార భద్రత కార్డు (పిడిఎస్) డేటాబేస్ ప్రామాణికంగా ఉంటుంది. అట్టి కుటుంబంలో, ఇంటి యజమాని, జీవిత భాగస్వామి, పిల్లలు మున్నగు వారు ఉంటారు.