కొనసాగుతున్న విచారణ
ప్రాజెక్టు డాక్యుమెంట్లు సమర్పించాలని జస్టిస్ పీసీ ఘోష్ ఆదేశం
(అమ్మన్యూస్, హైదరాబాద్):
కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ సోమవారం ఉదయం నుంచి కొనసాగుతోంది. ఇరిగేషన్ చీఫ్ సెక్రటరీ రాహుల్ బొజ్జాకు కమిషన్ ఫోన్ చేసింది. వెంటనే కమిషన్ ఆఫీసుకు రావాలని పిలిచింది. ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి డాక్యుమెంట్లు సమర్పించాలని కమిషన్ స్పష్టం ఆదేశించింది. దీంతో రాహుల్ బొజ్జా కమిషన్ ఆఫీసుకు హుటాహుటిన చేరుకున్నారు. ప్రస్తుత రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యదర్శి, బీఆర్ఎస్ హయాంలో నీటిపారుదల శాఖ ఇన్ఛార్జి కార్యదర్శిగా పనిచేసిన స్మితా సబర్వాల్ సైతం విచారణ కమిషన్ ఎదుట హాజరయ్యారు.
గతంలో సీఎంవోలో స్మితా సబర్వాల్ కీలకంగా కూడా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఐఏఎస్ వికాస్ రాజ్, రిటైర్డ్ ఐఏఎస్ రజత్ కుమార్లు కమిషన్∙ఎదుట హాజరు కాగా వారం రోజుల్లోగా అఫిడవిట్ ఫైల్ చేయాలని కమిషన్ ఆదేశించింది. వీరితో పాటు మాజీ సీఎస్ ఎస్కే జోషి, ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణ కాళేశ్వరం ఎంక్వైరీకి హాజరు అయ్యారు. కాగా, ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్, ముఖ్య అధికారులు కమిషన్ ఎదుట చెప్పే అంశాలపై ఉత్కంఠ నెలకొంది.