ఆషాఢమాసం వచ్చిందంటే చాలు భాగ్యనగరం పసుపు, కుంకుమలు అద్దుకుంటుంది. వేప వాసనలతో ఊరువాడ డప్పు చప్పుళ్లతో మురిసిపోతుంది. దశాబ్దాలుగా సాగుతున్న బోనాల వేడుకలు ఈనెల 7న గోల్కొండలో వైభవంగా ప్రారంభమయ్యాయి. కోటపై స్వయంభుగా వెలిసిన శ్రీ జగదాంబిక అమ్మకు భక్తులు వైభవంగా బోనాలను సమర్పించారు. తాజాగా ప్రజాభవన్లోని నల్ల పోచమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని, మంత్రి కొండా సురేఖ.. తలపై బోనాలను ఎత్తుకుని ప్రజాభవన్లోని నల్లపోచమ్మకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఘటాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్వయంగా తీసుకు వచ్చి శివసత్తులకు అందించారు. అనంతరం ఆలయంలో పూజలు నిర్వహించారు.
ఈసందర్భంగా సీఎం సహా మంత్రులకు పండితులు ఆశీర్వచనం అందించారు. డిప్యూటీ సీఎం నివాసం నుంచి ప్రజాభవన్ ఆవరణలో ఉన్న నల్ల పోచమ్మ దేవాలయం వరకు డబ్బు చప్పుళ్ళు, పోతురాజుల విన్యాసాల మధ్యన బోనాలను ఎత్తుకెళ్లారు. అనంతరం అమ్మవారికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు బోనంలో ఉన్న నైవేద్యాన్ని సమర్పించారు.