పది సంవత్సరాలుగా విద్యాబుద్ధులు నేర్పి తమతో మమేకమైన ఉపాధ్యాయులు పాఠశాల నుంచి వేరే స్కూలుకు బదిలీపై వెళ్లడంతో విద్యార్థులు భావోద్వేగానికి గురయ్యారు. ప్రతిరోజు పాఠాలు బోధించిన ఉపాధ్యాయులు రేపటి నుంచి తమ పాఠశాలకు రారని తెలియడంతో వారికి ఘనంగా వీడ్కోలు పలకాలని నిర్ణయించారు. తమకు ఉత్తమ బోధన చేసిన ముగ్గురు ఉపాధ్యాయులకు క్షీరాభిషేకం చేసి ఘనంగా సన్మానించారు విద్యార్థులు. ఇలా తమ రుణం తీర్చుకున్నామని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మిట్ట గూడెం ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది.
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మిట్టగూడెం ప్రాథమిక పాఠశాలలో పది సంవత్సరాలుగా సునీత, ఉషాకుమారి, సురేష్ ఉపాధ్యాయులుగా పని చేశారు. ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీల్లో ఈ ముగ్గురు ఉపాధ్యాయులు వేరే పాఠశాలకు బదిలీ అయ్యారు. తమకిష్టమైన గురువులు పాఠశాల వదిలి బదిలీపై వేరే పాఠశాలకు వెళుతున్నారని తెలుసుకున్న విద్యార్థులు.. వీడ్కోలు కార్యక్రమం వారిని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఉపాధ్యాయులకు క్షీరాభిషేకం చేశారు. ఆ తరువాత వారికి పూల మూలలు, శాలువా వేసి సన్మానించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులు, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. మంచిగా చదువుకొని ఉన్నంత స్థాయికి ఎదగాలని కోరారు.